అమ్మలో కమ్మదనం, పెళ్లిళ్లు కష్టంగా మారాయి: మోడీ
అమ్మ అనే పిలుపులోనే ఎంతో కమ్మదనముందన్నారు. స్వచ్ఛతకు మారుపేరు అమ్మ అన్నారు. అందుకే మన దేశంలో మహిళలకు, అమ్మలకు సముచిత స్థానముందని చెప్పారు. భారత్ సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అన్నారు. ప్రస్తుతం మహిళలపై దాడులు చూస్తుంటే మనం పద్దెనిమిదవ శతాబ్దానికంటే వెనక్కి పోయినట్లుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 21 శతాబ్ధంలోనూ గర్భంలోనే ఆడపిల్లలను చంపివేయడం చాలా శోచనీయమన్నారు.
వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలబడతారనే ఉద్దేశ్యంతోనే తల్లిదండ్రులు కొడుకుపై శ్రద్ధ చూపుతున్నారన్నారు. కానీ, కొడుకు కన్నా కన్నా కూతురే వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తుందనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. సమాజంలో మహిళ పురుషుల కంటే రెండు అడుగులు ముందే ఉంటుందన్నారు. ప్రజలు తమ సలహాలను, సూచనలను తనకు ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక వెబ్ సైట్ల ద్వారా పంపించవచ్చునని చెప్పారు.
ఆడపిల్లల సంఖ్య తగ్గిన కారణంగా పురుషులకు పెళ్లిళ్లు కావడమే కష్టంగా మారిందన్నారు. స్త్రీలకు సముచిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ ఆస్తులు మహిళల పైనే ఉంటాయన్నారు. అవకాశం ఇస్తే వారు దూసుకు వెళ్తారని చెప్పారు. ఆధునిక భారతంలో మహిళే శక్తివంతమైనదన్నారు. కొడుకు, కూతురు మధ్య తల్లిదండ్రులు వ్యత్యాసం చూపించవద్దని కోరారు. లింగ వివక్షపై పోరాడటంలో మీడియా పాత్ర అభినందనీయమన్నారు.