జగన్ కేసు: కెవిపి పాత్రపై సిబిఐని ప్రశ్నించిన కోర్టు
సూరీడు వాంగ్మూలం ఆధారంగా కెవిపి రామచందర్ రావుపై ఏం చర్యలు తీసుకున్నారని కోర్టు సిబిఐని అడిగింది. కెవిపిపై సూరీడు ఇచ్చిన వాంగ్మూలంలో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా అని న్యాయస్థానం అడిగింది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంపై కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో సిబిఐ సూరీడు, జన్నత్ హుస్సేన్, రమేష్లు సాక్షులుగా పేర్కొంది.
దాల్మియా సిమెంట్స్పై దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా సబితా ఇంద్రారెడ్డి సహా 13 మంది నిందితులకు సమన్లు జారీ చేయాలని కోరుతూ సిబిఐ మంగళవారం కోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో వారికి తమ ముందు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
సిబిఐ చార్జిషీట్లో తన పేరు ఉండడంతో సబితా ఇంద్రారెడ్డిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె రాజీనామాకు ఒత్తిడి పెరుగుతోంది. మంత్రివర్గ సమావేశాన్ని ఇక జైల్లోనే పెట్టుకోవాలని తాజా పరిణామంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. హోం మంత్రే వైయస్ జగన్ కేసులో ముద్దాయిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు శాంతిభద్రతల గ్యారంటీ ఎలా ఉంటుందని ఆయన అడిగారు. మంత్రులంతా రాష్ట్రాన్ని దొంగల్లా దోచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.