జైల్లో నిమ్మగడ్డను కలిసిన నాగార్జున, అల్లు అరవింద్
జగన్ను కలిసిన శివప్రసాద్ రెడ్డి
వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం ములాకత్ సమయంలో దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి చంచల్గూడ జైలులో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నానంటే అది వైయస్, జగన్ భిక్షే అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించినందువల్లే అసెంబ్లీలో అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశానని చెప్పారు. టిడిపి, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కై వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
వైయస్ పథకాలు మరోసారి అమల్లోకి రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే అన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు గెలుపు కోసం సామాన్య కార్యకర్తగా కృషి చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు. 2014 ఎన్నికల తర్వాత టిడిపి తన జెండాను మూసుకోవాల్సిందే అన్నారు.
జగన్ ధైర్యంగా ఉన్నారు: నల్లపురెడ్డి
వైయస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ధైర్యంగా ఉన్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. జైల్లో ఉన్న జగన్ను ఆయన ఈ రోజు కలిశారు. అనంతరం మాట్లాడారు. ఆయన జైల్లో ధైర్యంగా ఉన్నారని, ప్రజా సమస్యల కోసం పోరాడమని చెప్పారన్నారు. ఎన్నికల కోసం పని చేయమన్నారన్నారు. సిబిఐ కాంగ్రెసు చేతిలో కీలుబొమ్మలా మారిందన్నారు. ప్రజల మాట కోసం ఏ ముఖ్యమంత్రి కొడుకు ఇలా ఇప్పటి వరకు అధికార పార్టీని వ్యతిరేకించలేదన్నారు. సోనియాకు తలవంచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ఎన్టీఆర్ జాతి సంపద
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జాతి సంపద అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, జాతిపిత మహాత్మా గాంధీలాగా ఎన్టీఆర్ కూడా జాతి సంపద అన్నారు.
అలాంటి నేత ఫోటోను వినియోగించుకోవడంపై తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం సరికాదన్నారు. ఎన్టీఆర్ కూతురు దగ్గుపాటి పురంధేశ్వరి తండ్రి ఫోటో పెట్టుకొని కాంగ్రెసు అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు వివాదం చేయలేదన్నారు. ఎన్టీఆర్ విషయంలో రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ చెప్పింది వాస్తవమే అన్నారు. ఎన్టీఆర్ ఎవరి పేటెంట్ హక్కు కాదన్నారు.