సబితకు అండ: కల్సిన టిడిపి, జగన్ వర్గం ఎమ్మెల్యేలు
ఛార్జీషీటులో పేరున్నందున సబిత రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో పాటు ఇతర పార్టీల నేతలు వారించడంతో ఆమె వెనక్కి తగ్గారు. అయితే, ఆమె రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నట్లుగా సమాచారం. సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ఆమె ప్రకటించే అవకాశం ఉంది.
సబిత తప్పు చేయలేదు... శేషా రెడ్డి
సబితను కలిసిన అనంతరం శేషా రెడ్డి మాట్లాడుతూ... సబితా ఇంద్రా రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, మైనింగ్ వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటోందని అన్నారు. తప్పు జరిగితే అప్పుడే ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఛార్జీషీటులో పేరు ఉన్నంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేలంతా సబితకు మద్దతుగా ఉంటారన్నారు.
సబితా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు... డికె అరుణ, కన్నా
సబితా ఇంద్రా రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డికె అరుణ అన్నారు. ఆరోణలు వచ్చిన వారంతా రాజీనామా చేయాలంటే ఎందరో రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారమే హోంమంత్రి సబిత వ్యవహరించారన్నారు. సబిత తప్పు చేయలేదని, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని ఆమెకు చెప్పామన్నారు.
కిరణ్ పర్యటన వాయిదా
ఛార్జీషీటులో మంత్రుల పేర్ల నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకరపల్లి పర్యటన వాయిదా పడింది. మరోవైపు ఆయనను మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, పితాని సత్యనారాయణ, శైలజానాథ్లు కలిశారు.