సబిత: భర్త మృతితో పొలిటిక్స్, ఒత్తిడితోనే రాజీనామా
రంగారెడ్డి జిల్లాలో ఆమె క్రమంగా బలమైన నేతగా ఎదిగారు. దాంతో రంగారెడ్డిలో ఆమెకు పార్టీలో బలమైన ప్రత్యర్థి వర్గం కూడా ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పార్టీలోని కొంత మంది నాయకులు ఆమెకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు గళం విప్పుతూ వస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ఆమె పేరు చోటు చేసుకోవడంతో రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
సోమవారం సాయంత్రం ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. రాజీనామా చేయవద్దని ఆయన సబితా ఇంద్రారెడ్డికి గట్టిగానే సూచించారు. చాలా మంది మంత్రులు కూడా ఆమెకు అండగా నిలిచారు. కానీ ఆమె రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సబితా ఇంద్రారెడ్డి భర్త పటోళ్ల ఇంద్రారెడ్డి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి సబితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.
సబితా ఇంద్రారెడ్డికి వైయస్ రాజశేఖర రెడ్డి కీలకమైన మంత్రిత్వ శాఖలు కట్టబెట్టడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని హోం మంత్రిగా నియమించారు. ఓ మహిళకు హోం మంత్రిత్వ శాఖను కట్టబెట్టడం విప్లవాత్మక చర్యగా పరిగణించారు. గనుల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు సున్నంరాయి గనులను సిమెంట్ కంపెనీలకు కట్టబెట్టిన విషయంపైనే సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు సిబిఐ నుంచి అభియోగాలను ఎదుర్కుంటున్నారు.
హోం మంత్రిగా ఆమె పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె అన్ని వైపుల నుంచి ఒత్తిడిని, విమర్శలను ఎదుర్కున్నారు. ఎదిగివచ్చిన కుమారుడు కార్తిక్ రెడ్డిని కూడా ప్రతిపక్షాలు లక్ష్యం చేసుకున్నాయి. వివిధ సంఘటనల్లో కార్తిక్ రెడ్డిపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. కార్తిక్ రెడ్డి వైయస్ జగన్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఇటీవల రాహుల్ గాంధీ దూతను కలిసి తనకు చేవెళ్ల టికెట్ కావాలని అడిగారు. ప్రస్తుత పరిణామంతో సబితా ఇంద్రారెడ్డి రాజకీయ జీవితంపై నీలినీడలు అలుముకున్నాయి.