రాజీనామా చేస్తా: సబిత, దాటేసిన వాయలార్
రాజీనామా చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా చాలా మంది తనకు సలహా ఇచ్చారని, అయితే, తన సహచరులు ఏం చెప్పినా తన నిర్ణయం తనదేనని ఆమె అన్నారు. తాను మంత్రివర్గంలో కొనసాగడం నైతికం కాదని ఆమె అన్నారు. న్యాయపోరాటం చేసి, తన నిజాయితీని నిరూపించుకుంటానని ఆమె చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని, న్యాయం తనవైపే ఉందని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తాను నిర్దోషిగా బయటకు వస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
కాగా, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాను కాంగ్రెసు పార్టీ అధిష్టానం అడుగుతుందా అని మీడియా ప్రతినిధులు అడిగితే కేంద్ర మంత్రి, కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి సమాధానం దాటవేశారు. తాను అధిష్టానం కాదని ఆయన జవాబిచ్చారు. సిబిఐ అరెస్టులు చేయవచ్చు, కేసులు నమోదు చేయవచ్చునని, ఇది సిబిఐ విధినిర్వహణలో భాగమని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానంలో తాను ఓ సభ్యుడిని మాత్రమేనని ఆయన న్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును సిబిఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో నిందితురాలిగా చేర్చడంపై వ్యాఖ్యానించడానికి కూడా ఆయన నిరాకరించారు.
వైయస్ జగన్ కేసులో సిబిఐ సోమవారం దాఖలు చేసిన ఐదో చార్జిషీట్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నాలుగో నిందితురాలిగా సిబిఐ చేర్చింది. దాల్మియా సిమెంట్స్పై సిబిఐ ఈ చార్జిషీట్ను దాఖలు చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటికే జగన్ కేసుల్లో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను, మంత్రి ధర్మాన ప్రసాదరావును సిబిఐ నిందితులుగా చేర్చింది. తన పేరును నిందితుడిగా చేర్చిన తర్వాత మోహిదేవి వెంకరమణ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ధర్మాన ప్రసాదరావు చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు.