రియల్ ఎస్టేట్ టైకూన్ భరద్వాజ్ హత్య: కొడుకు అరెస్ట్
తన తండ్రి దీపక్ భరద్వాజ్ను చంపేందుకు నితేష్ భరద్వాజ్ కాంట్రాక్టు కిల్లర్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పోలీసులు చెప్పారు. ఇందుకోసం నితేష్ రూ.6 కోట్లను హవాలా ద్వారా కాంట్రాక్టు కిల్లర్స్కు చెల్లించారని చెబుతున్నారు. ఈ హత్య మార్చి 26వ తేదిన జరిగింది.
మరోవైపు ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపక్ హత్య కేసులో ఓ స్వామికి కూడా సంబంధం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడి బంధువైన నితేష్ ప్రాపర్టీ విషయమై భరద్వాజ్ను చంపించి ఉంటారని విచారణాధికారులు అనుమానిస్తున్నారు.
2009 ఎన్నికల్లో దీపక్ భరద్వాజ్ లోకసభ ఎన్నికలకు బిఎస్పీ తరఫున పోటీ చేశాడు. అప్పుడు అతను తన ఆస్తులను రూ.600 కోట్లుగా చెప్పారు. ఇప్పుడు దీపక్ ఆస్తులు మరింత పెరిగి ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి సొంతగా ఆశ్రమం పెట్టాలని భావించాడట. ప్రస్తుతం సదరు స్వామి పరారీలో ఉన్నాడు.
దీపక్ భరద్వాజ్ హత్యకు ఆరు నెలల ముందే ప్లాన్ వేశారని పోలీసులు భావిస్తున్నారు. దీపక్ను చంపేందుకు జనవరి, మార్చి నెలల్లో రెండుసార్లు ప్రయత్నాలు చేశారని అనుమానిస్తున్నారు. నితేష్ కుమార్ బాలీవుడ్ నటుడి బంధువును పెళ్లి చేసుకున్నాడు.