అంజలి చివరిసారి మాట్లాడింది వేణు మల్లాడితో?
అంజలి వాంగ్మూలం అందితే తప్ప దాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతించబోమని వారు చెప్పారు. అంజలి చివరి ఫోన్ కాల్ శంషాబాద్ నోవాటెల్ నుంచి చేసిందని రవిశంకర్ చెప్పారు. బుధవారం ఉదయం తమ అమ్మకు ఫోన్ చేసి తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పిందని ఆయన అన్నారు. అయితే, రవిశంకర్ మాటలను పోలీసులు నమ్మడం లేదని వార్తలు వస్తున్నాయి. అంజలి ఫోన్ కాల్ డేటాను పోలీసులు సేకరించి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. అంజలి చివరిసారి హీరో వేణు మల్లాడితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. వేణు మల్లాడితో కలిసి అంజలి ఓ సినిమాలో నటించింది.
మీడియా కథనాల ప్రకారం - అంజలి సోమవారం ఉదయం 8 గంటల 5 నిమిషాలకు తాను బస చేసిన హైదరాబాద్లోని మాదాపూర్లో గల దస్పల్లా హోటల్ నుంచి బయటకు వెళ్లింది. అక్కడి నుంచి ఆమె ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. మధ్యలో రెండు గంటల పాటు నోవాటెల్ వద్ద బస చేసిందని అంటున్నారు.
అంజలి రెండు గంటల్లో తన ఫోన్ నుంచి 18 కాల్స్ చేసినట్లు, హైదరాబాద్, చెన్నైల్లోనివారికే ఈ ఫోన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అంజలి తల్లి రాజోలులో ఉందని తెలుస్తోంది. అంజలి దస్పల్లా హోటల్ నుంచి బయలుదేరుతూ తన తల్లికి ఫోన్ చేసింది. దాదాపు 18 కాల్స్ చేసిన తర్వాత ఆమె ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ఫోన్ స్విచాఫ్ చేసినట్లు చెబుతున్నారు.
హోటల్ నుంచి బయలుదేరుతూ తనకు ఫోన్ చేసినప్పటికీ అంజలి తల్లి ఏమీ మాట్లాడలేదు. అదృశ్యంపై వార్తలు వచ్చిన తర్వాత కూడా ఆమె ఏమీ అనలేదు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత అంజలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అంజలి తల్లి, సోదరుడి వ్యవహారాలపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాను క్షేమంగా ఉన్నట్లు అంజలి ఫోన్ చేసినట్లు చెబుతున్న సమాచారాన్ని అందుకే పోలీసులు విశ్వసించడం లేదని అంటున్నారు. ఆ సమాచారంలో ఏ మేరకు నిజం ఉందనేది కూడా తెలియడం లేదు. తాను రెండు రోజుల్లో హైదరాబాద్ వచ్చి పోలీసులను కలుస్తానని చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఉగాది పండుగ తర్వాత హైదరాబాద్ వచ్చి పోలీసు కమిషనర్ను కలుస్తానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అంజలి అదృశ్యంపై వస్తున్న సమాచారంలో ఒకదానికి మరోదానికి పొంతన లేకుండా ఉన్నాయి. దీంతో ఆమె అదృశ్యం ఇంకా మిస్టరీగానే ఉంది.