1984 అల్లర్లు: జగదీష్ టైట్లర్పై కేసు రీఓపెన్
కేసును మూసివేయాలని సిబిఐ 2009లో ఇచ్చిన నివేదికను లఖ్విందర్ కౌర్ సవాల్ చేశారు. అల్లర్లలో ఆమె భర్త మరణించాడు. సిబిఐ ఇద్దరు కీలకమైన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను తీసుకోవాలని, అల్లర్లు జరిగిన తర్వాత వారిద్దరు అమెరికా వెళ్లారని ఆమె వాదించారు. బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చాలని సిబిఐ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు.
అల్లర్ల సందర్భంగా ముగ్గురు వ్యక్తులు మరణించిన ఉత్తర ఢిల్లీలోని గురుద్వారా పుల్బంగష్ వద్ద 1984 నవంబర్ 1వ తేదీన టైట్లర్ లేరని సిబిఐ దర్యాప్తులో తేలిందని సిబిఐ ప్రాసిక్యూటర్ చెబుతూ ఆ పిటిషన్ను తోసిపుచ్చాలని కోరారు.
సంఘటన జరిగిన సమయంలో జగదీష్ టైట్లర్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నివాసం తీన్మూర్తి భవన్లో ఉన్నారని సిబిఐ ప్రాసిక్యూటర్ చెప్పారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో పేర్కొన్న ముగ్గురు ప్రముఖ నాయకుల్లో జగదీష్ టైట్లర్ ఒక్కరు. సజ్జన్ కుమార్, హెచ్కెఎల్ భగత్ మిగతా ఇద్దరు నాయకులు. భగత్ మరణించారు.
ఇద్దరు సిక్కు గార్డులు 1984 అక్టోబర్ 31వ తేదీన ఇందిరా గాంధీని హత్య చేసిన తర్వాత చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయారని అంటారు.