సబితపై డైలమా: సోనియా వచ్చాకే నిర్ణయం
సోనియా శుక్రవారం స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోబోరని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు పంపించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ బుధవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆచితూచి స్పందించారు. చార్జిషీటులో సబితపై ఏ అభియోగాలున్నదీ తాను చూడలేదని, సీబీఐ ఈ చార్జిషీటుపై కోర్టు స్పందన కూడా చూడాల్సి ఉందని అన్నారు. అన్నీ అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు.
జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సబితకు ఇతర మంత్రులు సంఘీభావంగా నిలిచారు. అయినా, సబితా ఇంద్రారెడ్డి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వ ప్రతిష్టనే కాకుండా పార్టీ ప్రతిష్ట కూడా దిగజారుతుందనే అభిప్రాయం ఆజాద్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ధర్మాన విషయంలో అనుసరించిన పద్ధతినే సబితా ఇంద్రారెడ్డి విషయంలో అనుసరిస్తే మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణపై కూడా ఇదే వైఖరి అవలంబించాల్సి వస్తుందని అనుకుంటున్నారు.
ఆజాద్తో బొత్స భేటీ
బుధవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆజాద్తో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. 'చార్జిషీటు మంత్రుల'పై అనుసరించాల్సిన వైఖరి గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఆజాద్కు బొత్స ఒక నోట్ అందజేశారు. మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కూడా ఆజాద్ను కలుసుకుని రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గురించి వివరించారు.
సబితా ఇంద్రారెడ్డికి మంత్రుల మద్దతు
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం సబిత ఇంటికి వెళ్లి, రాజీనామా చేయొద్దని ఆమెకు ధైర్యం చెప్పారు. మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్, కాసు కృష్ణారెడ్డి, శ్రీధర్బాబు సబితను కలిశారు. మరో మంత్రి పార్థసారథి ఫోన్లో పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రులు జీవన్రెడ్డి, త్రిపురనేని వెంకటరత్నం, విప్ అనిల్, ఎమ్మెల్సీలు జగదీశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి, వైసీపీ నాయకులు, మాజీ మంత్రి మారెప్ప మరికొందరు నేతలు సబిత ఇంటికి వచ్చారు.