జగన్పై పితాని ఫైర్: సబిత ఇష్యుపై టిడిపి అల్టిమేటం
ఇంతకాలం జగన్ పార్టీ నేతలు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా ఆరోపించారని గుర్తు చేస్తూ అదే నిజమైతే మంత్రులపై ఆ సంస్థ అభియోగాలు మోపేదా అని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి న్యాయనిపుణుల సూచనలు తీసుకుంటున్నారని పితాని చెప్పారు. తర్వాత ఆమె రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
సబితను కాపాడే యత్నం..: దేవినేని ఉమ
జగన్ పత్రిక సీఈవో సోదరుడి కంపెనీకి సబిత గనుల మంత్రిగా లీజులు ఇచ్చారని, అందుకే ఇప్పుడు ఆమెకు అనుకూలంగా ఆ పత్రికలో కథనాలు రాస్తున్నారని, ఇదొక రకం క్విడ్ప్రోకో'' అని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. సబిత రాజీనామా చేయకుండా అధిష్ఠానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పడం మంచి సంప్రదాయం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
హోం మంత్రి సబితారెడ్డి పేరును నిందితురాలిగా సిబిఐ తన చార్జిషీట్లో చేర్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అల్టిమేటం జారీచేసింది. 24 గంటల్లోగా కళంకిత మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించడమో లేదా రాజీనామా చేయించడమో చేయని పక్షంలో సీఎం ఇల్లు ముట్టడిస్తామని ఆ పార్టీ హెచ్చరించింది. గురువారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో ఆ పార్టీ నేతలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావులపాటి సీతారామారావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కోట్ల రూపాయల కుంభకోణాల్లో సిబిఐ దర్యాప్తులో నిందితులుగా తేలిన మంత్రులు దర్జాగా తిరుగుతున్నారని ముద్దు వ్యాఖ్యానించారు. జగన్ పత్రిక సీఈవో సోదరుడి కంపెనీకి మూడు నెలల్లో గని లీజు బదిలీ చేయాలని నిబంధన పెట్టి జీవో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, అందుకే సబితపై సిబిఐ కేసు పెట్టిందని ఆయన అన్్నారు.
జగన్ లక్ష కోట్లు తింటే వీళ్లు పదుల కోట్లు తిన్నారని, అందుకే ఇలాంటి జీవోలు ఇచ్చారని, ఆ ఫైలును తిప్పి పంపి ఉంటే ఈరోజు నిర్దోషులుగా ఉండేవారని అన్నారు. సూరీడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అప్పటి ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావును తక్షణం అరెస్టు చేయాలని ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. కెవిపి ద్వారా సోనియాకు కూడా వాటాలు ముట్టాయని, అందువల్లనే ఆమె కెవిపి విషయంలో పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
సీబీఐ చార్జిషీటు దాఖలు చేయగానే సంబంధిత మంత్రి రాజీనామాను ముఖ్యమంత్రి కోరి ఉండాల్సిందని, కానీ ఆయనే అడ్డుపడటం దారుణమని రావులపాటి వ్యాఖ్యానించారు. ఈ కేసు ముఖ్యమంత్రి సొంత ఆస్తులకు సంబంధించింది కాదని, ప్రజల ఆస్తులపై దర్యాప్తు జరిగి నిందితుల నిర్ధారణ జరిగిన తర్వాత వారిని వెనకేసుకు రావడం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు చేయకూడని పనని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు.