కెవిపిని అరెస్టు చేస్తేనే: యాష్కీ, సిఎంతో తేడా: వివేక్
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన కుట్రలు, అక్రమాలన్నింటికీ కెవిపియే ప్రధాన సూత్రధారి అని యాష్కీ ఆరోపించారు. కెవిపిని ప్రశ్నిస్తే అన్ని విషయాలూ బయటపడతాయని ఆయన అన్నారు. తెలంగాణ నేతలు కూడా తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది వారేనని ఆయన అన్నారు. ఏదో ఒక్క రాజకీయ పార్టీ వల్ల తెలంగాణ రాదని, ప్రజల చేతిలో ఉద్యమం ఉన్నప్పుడే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని పెద్దపల్లి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు వర్గం తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందనే వార్తలను ఆయన ఖండించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొంత మంది తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేస్తున్న తన కృషిని అడ్డుకునేందుకే కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు విషయమై మరోసారి ప్రధాని మన్మోహన్ సింగ్ను కలుస్తానని ఆయన చెప్పారు.