ఎంపీలకు కెసిఆర్ డెడ్లైన్: మందా దార్లోనే కేశవరావు?
ఈ రోజు(ఆదివారం) కెసిఆర్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావుతో భేటీ అయ్యారు. ఆయనతో కూడా తెరాసలో కాంగ్రెసు ఎంపీలతో పాటు ఆయన చేరికపై మాట్లాడినట్లుగా సమాచారం. ఎవరెవరు వస్తారు? ఎప్పుడు వస్తారు? అనే అంశాలపై మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 27న తెరాస ఆవిర్భాన దినోత్సవం లోగా ఎంపీలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించినట్లుగా చెబుతున్నారు.
కెకెతో కెసిఆర్ భేటీలో మందా జగన్నాథం కూడా పాల్గొన్నారు. మిగిలిన ఎంపీల విషయాన్ని పక్కన పెట్టి మందతో పాటు కెకె రెండు మూడు రోజుల్లో తెరాసలో చేరే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాంగ్రెసు ఎంపీలు తెరాసలో చేరితేనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని కెసిఆర్తో పాటు కెకె కూడా భావిస్తున్ననట్లుగా సమాచారం. తెలంగాణపై కాంగ్రెసు తేల్చలేదని తెలిసే వారు తెరాసలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
కొన్నాళ్లుగా తెరాసలోకి కాంగ్రెసు పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు వెళ్తారనే ప్రచారం సాగింది. అయితే, అందులో నలుగురు వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. మందా, వరంగల్ ఎంపి రాజయ్య, పెద్దపల్లి ఎంపి వివేక్లు తెరాసలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు. మందా, కెకెలు త్వరలో తెరాసలోకి వెళ్తున్న ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే, రాజయ్య విషయంలో మాత్రం అనుమానాలున్నట్లుగా చెబుతున్నారు.
ఆయన తన తనయుడికి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ టిక్కెట్ను కెసిఆర్ను అడుగుతున్నారట. దీనిపై తేల్చితే ఆయన తెరాసలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే, రాజయ్య వచ్చినా రాకున్నా పెద్దగా వచ్చే ఇబ్బందేమీ లేదనే అభిప్రాయంతో కెసిఆర్ ఉన్నారంటున్నారు.