ప్రఖ్యాత గాయకుడు పిబి శ్రీనివాస్ కన్నుమూత
పిబి శ్రీనివాస్ 1930 సెప్టెంబర్ 22వ తేదిన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. వీరి ఇంటిపేరు ప్రతివాద భయంకర. తల్లిదండ్రులు శేషగిరమ్మ, లక్ష్మణ ఫణీంద్ర స్వామి. తల్లి వైపు వారందరూ సంగీతంలో పట్టు ఉన్నవారు. తల్లి శేషగిరమ్మ వల్లే శ్రీనివాస్కు సంగీతం పట్ల మక్కువ కలిగింది.
సోదరి మణి రఘునాథ్ వీణా విద్వాంసురాలు. తండ్రిది బదలీ అయ్యే ఉద్యోగం. దీంతో కాకినాడలో ఉన్న మేనమామ వద్దే పిబి శ్రీనివాస్ చదువుకున్నారు. కాకినాడలో బి.కామ్ చదివి, మద్రాసులో లా కాలేజీలో చేరారు. చిన్నప్పటి నుంచే అన్ని భాషలకు చెందిన చిత్రాలు పదే పదే చూడటం, పాటలు విని స్వరాలు రాసుకొని సాధనం చేయడం చేసేవారు.
పిబి శ్రీనివాస్ ఎనిమిది భాషల్లో ప్రవీణులు. సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషులలో అతను నేర్పరి. పలు భాషల్లో కవితలు కూడా అల్లారు. అతను భలేరాముడు, జయభేరీ, రుణానుబంధం, సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి, శాంతినివాసం, ఇద్దరు మిత్రులు, ఇంటికి దీపం ఇల్లాలు, శ్రీ సీతారామ కల్యాణం, సంపూర్ణ రామాయణం వంటి ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు.
పిబి శ్రీనివాస్ దాదాపు రెండు వందల చిత్రాల్లో పాటలు పాడారు. మొత్తంగా కన్నడ కంఠీరవ రాజ్కుమార్కు ఎక్కువ పాటలు పాడారు. తెలుగులో కాంతారావుకు ఎక్కువగా పాడారు. ఆయన జాతక ఫలం చిత్రంలో మొదట పాడారు. పిబి శ్రీనివాస్ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ రోశయ్య సంతాపం తెలిపారు.