టి కాంగ్ ఎంపీల రహస్య భేటీ: వివేక్ డైలమా, పొన్నం నో
వీరు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరాసలోకి వెళ్లే అంశంపై మంతనాలు జరిపినట్లుగా సమాచారం. మందా జగన్నాథం దాదాపు తెరాసలోకి వెళ్లేందుకే సుముఖత చూపినట్లుగా తెలుస్తోంది. కె కేశవ రావు కూడా తెలంగాణపై అధిష్టానం తేల్చకుంటే తెరాసలోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదన్నారట. అయితే, కొంతకాలం చూసిన తర్వాత నిర్ణయం తీసుకుందామని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సూచించారని సమాచారం.
నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ కాంగ్రెసులో ఉండేందుకే నిర్ణయించుకున్నారు. పొన్నం కూడా అదే దార్లో నడుస్తారని అంటున్నారు. మందా జగన్నాథం ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల సమయంలో తెలంగాణ కోసం సస్పెండై 27లోగా పార్టీలో చేరాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు వివేక్, వరంగల్ ఎంపి రాజయ్యలు డైలామాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ డైలామా
తెలంగాణ కాంగ్రెసు ఎంపీల అంశంపై వివిధ రకాల ప్రచారం సాగుతుండగా కోమటిరెడ్డి సోదరులు కూడా ఏ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం మొదలయింది. వారు తెరాసలోకి, జగన్ వైపుకు అనుకూలంగా ఉన్నారు. దీంతో ఏ పార్టీలో చేరతారనే అంశం సస్పెన్స్గా మారింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కోమటిరెడ్డి సోదరుల బాటలోనే నడుస్తారని అంటున్నారు.