తెరాసలోకి టిడిపి ఎమ్మెల్యేలు?: నారదాసు ఆందోళన
కరీంనగర్ జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతారనే ప్రచారం ఆదివారం రాత్రి జోరుగా సాగింది. టివి ఛానళ్లలో ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రధానంగా టిడిపిలో ఆందోళన కలిగించింది. జిల్లా తెరాసలోను కాకరేపింది. కరీంనగర్ అసెంబ్లీ టికెట్పై తెరాస మాజీ ఎమ్మెల్సీ, ఆ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి నారదాసు లక్ష్మణరావు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు గంగుల కమలాకర్ పార్టీలోకి వస్తున్నారనే ప్రచారంతో నారదాసు వర్గీయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
హైదరాబాద్లో గడప గడపకు తెలంగాణ కార్యక్రమంలో పాల్గొంటున్న నారదాసు వర్గీయులు ఎడ్ల అశోక్ ఆధ్వర్యంలో హుటాహుటిన పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసానికి చేరుకున్నారు. ఆ సమయానికి కెసిఆర్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు నివాసంలో ఉన్నారు. కొద్ది సేపటికి తిరిగి తన నివాసానికి వచ్చారు. ఆ తర్వాత 7.30 గంటల ప్రాంతంలో వారిని కెసిఆర్ కలిశారు.
టిడిపి ఎమ్మెల్యేల చేరికపై వారు ప్రశ్నించారు. వారు పార్టీలోకి వస్తారని, టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోందని కెసిఆర్ను వారు అడిగారు. ఆయనకు స్థానికంగా మంచిపేరు లేదు. మొదటనుంచి తెరాసలో కష్టపడి పని చేస్తున్న నారదాసు లక్ష్మణ రావుకే పార్టీ టికెట్ ఇవ్వాలన్నారు. దీనికి కెసిఆర్ స్పందిస్తూ సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు ఇస్తామని, ఇతరత్రా జరుగుతున్న ప్రచారంతో అయోమయానికి గురి కావొద్దని చెప్పారట.
గంగుల కమలాకర్ను పార్టీలోకి తీసుకోబోమని, నారదాసుకే అవకాశం ఇస్తామనే స్పష్టమైన హామీ ఇవ్వలేదట. గంగుల కమలాకర్, దేవయ్య కూడా ఈ ప్రచారాన్ని సూటిగా ఖండించలేదు. టిడిపిని వీడి వెళుతున్నట్లు తాము ఎవరికీ చెప్పలేదని, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పారు.