కాళ్ల నొప్పితీవ్రం: అంగరక్షకుల సాయంతో నడిచిన బాబు
కాలి వేళ్లతోపాటు కండరాల నొప్పి కూడా తీవ్రం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆయన శనివారం నుంచి విశాఖ జిల్లా శృంగవరం గ్రామ శివార్లలోని కొబ్బరి తోటలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బసలో విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదిక పైకి వచ్చేందుకు చంద్రబాబు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. తాను విశ్రాంతి తీసుకుంటున్న బస్సు నుంచి దిగేందుకు, ఆ తర్వాత వేదిక వరకు నడిచేందుకు అంగరక్షకుల సహాయం తీసుకున్నారు.
హుషారుగా ఉండే చంద్రబాబు ఆదివారం నీరసంగా, బలహీనంగా కనిపించారు. శనివారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకున్న ఆయన సతీమణి భువనేశ్వరి ఆదివారం కూడా చంద్రబాబు వద్దనే ఉన్నారు. వైద్యులు నడవవద్దని సూచించినప్పటికి శుక్రవారం ఆయన నడిచారు. అయితే, రోజుకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉండగా ఆరోగ్యం సహకరించని కారణంగా ఆరున్నర కిలోమీటర్లు మాత్రమే నడవగలిగారు.
శనివారం, ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం నుంచి మళ్లీ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. అడుగు తీసి అడుగు వేయలేక పోతున్న ఆయన యాత్ర ఎలా చేస్తారోనని నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిచే దూరాన్ని తగ్గించి, రాత్రి బస సంఖ్య పెంచి పాదయాత్రను విశాఖపట్నం వరకు కొనసాగిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.