లంచం ఇవ్వలేక సేలం బస్టాండ్లో ఆంధ్ర మహిళ కాన్పు
కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన శామ్యూల్, లక్ష్మిలు బతుకుదెరువు నిమిత్తం సేలంలో కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి వెంకటేష్ (5), నవీన్ (2) సంతానం. లక్ష్మి మూడోమారు గర్భం దాల్చింది. ప్రసవ వేదనతో ఆసుపత్రికి వెళ్లింది.
ఆమె భర్త శామ్యూల్ను అక్కడి నర్సులు డబ్బులు డిమాండ్ చేశారు. తమ బీద పరిస్థితిని వివరించి కనికరించమని శామ్యూల్ వేడుకొన్నా ఫలితం లేకపోయింది. డబ్బులు లేకుంటే వైద్యం చేయమని నర్సులు నిష్కర్షగా చెప్పి, లక్ష్మిని ఆసుపత్రిలో చేర్చుకొనేందుకు నిరాకరించారు.
ఈ పరిస్థితుల్లో పురిటి నొప్పులు అధికమవ్వడంతో స్థానికులు బస్టాండు సమీపంలోని చెట్టు కిందనే ప్రసవం చేశారు. ఎలాంటి వైద్యసాయం లేకుండానే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. దిక్కుతోచని స్థితిలో తమకు సాయపడిన స్థానికులకు శామ్యూల్కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఓ అంబులెన్సులో ఆమెను అదే ఆసుపత్రికి తరలించారు. విచారణ జరిపిస్తామని ఆసుపత్రి డీన్ చెప్పారు.