గడువు పెంచండి: సుప్రీంకోర్టులో సంజయ్ దత్ పిటిషన్
న్యూఢిల్లీ: 1993 నాటి పేలుళ్ల కేసులో జైలు శిక్షను అనుభవించేందుకు తాను లొంగిపోవాల్సిన గడువును పెంచాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సోమవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంజయ్ దత్ దరఖాస్తు రేపు విచారణకు రానుంది.
1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్కు సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. సుప్రీం మార్చి 21న తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సంజయ్ శిక్ష అనుభవించేందుకు కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశం మేరకు మరో మూడు రోజుల్లో(గురువారం, ఏప్రిల్ 18లోగా) సంజయ్ దత్ లొంగిపోవాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సంజయ్ దత్ ఈ రోజు సుప్రీంను గడువు పెంచాలంటూ ఆశ్రయించారు. నాటి బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ అక్రమాయుధాలు కలిగి ఉన్నారనే కేసు కింద శిక్షను అనుభవించాల్సి ఉంది. అతనికి బాంబే కోర్టు ఆరేళ్ల శిక్షను విధించింది. సుప్రీం దానిని ఐదేళ్లకు తగ్గించింది. సంవత్సరంన్నర సంజయ్ శిక్షను అనుభవించినందున మరో మూడున్నరేళ్లు అనుభవించాల్సి ఉంది.
సంజయ్ దత్ చేతిలో ఇప్పుడు పలు సినిమాలు ఉన్నాయి. అవన్నీ వందల కోట్లలో ఉన్నాయి. తాను జైలుకు వెళ్లే ముందు ఆ సినిమాలను పూర్తి చేసి వెళ్లాలని సంజయ్ భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం సంజయ్ దత్.. రాజు హిరాణీ యొక్క పి.కె. చిత్రంతో పాటు టిపి అగర్వాల్ పోలీస్ గిరి చిత్రానికి డబ్బింగ్ చెప్పే బిజీలో ఉన్నారు. సంజయ్ చిత్రాన్ని పూర్తి చేశారని, కేవలం డబ్బింగ్ మాత్రమే చెప్పాల్సి ఉందని పోలీసు గిరి అగర్వాల్ చెప్పారు. ఇంకా పలు చిత్రాలు సంజయ్ పూర్తి చేయాల్సి ఉంది.