కాంగ్రెస్ తెలంగాణని మరిచింది: కెకె, కెటిఆర్ కొత్త వ్యాఖ్య
కేంద్రం తెలంగాణను ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని అధికార పార్టీలో విలీనం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పటికే చెప్పారన్నారు. తెరాస ఓ పార్టీ కాదని, ఓ ఉద్యమం అన్నారు. తాము తెలంగాణ ఉద్యమంలో చేరాలని భావిస్తున్నామని అన్నారు. తమను పార్టీకి చెందిన కొందరు నేతలు విమర్శిస్తున్నారని దానిని తాను ఖండిస్తున్నానని ఆయన చెప్పారు.
ఈ నెల 27లోపు పార్టీలో చేరే విషయమై ఆలోచించుకుంటే బాగుంటుందని కెసిఆర్ సూచించారన్నారు. తనకు పార్టీలు, పదవుల కంటే తెలంగాణే ముఖ్యమన్నారు. తాను రాజకీయాల్లోంచి తప్పుకున్నా, చనిపోయినా తన తర్వాత రాజకీయాల్లోకి రావాలని తన కొడుకులకు చెప్పానన్నారు. ఈ వయస్సులో తాను పార్టీ మారుతానని అనుకోవడం లేదన్నారు. ఎల్లుండి ఎంపీలం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. తెలంగాణ కోసం అన్ని శక్తులను కలుపుతానని చెప్పారు.
కెకెకు తెలిసొచ్చింది!
జాతీయ పార్టీలు ప్రాంతీయ సమస్యలను పట్టించుకోవడం లేదని కెకె ఆరోపించారు. అందుకే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని భాష్యం చెప్పారు. తమ ప్రాంత ప్రజల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్షను పట్టించుకోక పోవడం సరికాదన్నారు.
బాబు, వైయస్ పార్టీలు మారినవారే: కెటిఆర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అందరూ ఓ సమయంలో పార్టీలు మారిన వారేనని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం వేరుగా అన్నారు. తెరాసలోకి వలసలు కొత్తేమీ కాదన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో తెరాస ఉంటుందని కెటిఆర్ కొత్తగా ఆసక్తిక వ్యాఖ్య చేశారు. గెలిచే జెఏసి నేతలకు ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు.