ఐపిఎల్ బెట్టింగ్స్లో భాగ్యనగరమే టాప్!?
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఐపిఎల్ 6 ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచులకు మంచి ఆదరణ లభిస్తోంది. మ్యాచులు ఎంత ఆసక్తిరంగా, ఉత్కంఠగా సాగుతున్నాయో అంతకంటే ఎక్కువగా మ్యాచులపై, విజేతలపై బెట్టింగ్స్ కొనసాగుతున్నాయట. ఐపిఎల్ 6 బెట్టింగ్స్ కోసం పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఐపిఎల్ మ్యాచులు ఇంకా ప్రారంభంలోనే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే అంతిమ విజేతపై బెట్టింగ్స్ సాగుతున్నాయట. ఏ మ్యాచుకు ఆ మ్యాచ్ పైనా పందేలు కాస్తున్నారట. ఐపిఎల్ మొదటి అంచెలో దాదాపు ఆరువేల కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి.
ఐపిఎల్ 1 కంటే ఐపిఎల్ 6 పందేలు దాదాపు ఏడు రెట్లు పెరిగిందంటున్నారు. దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకు బెట్టింగులు ఈ ఐపిఎల్ సీజన్లో జరగనున్నాయట. మరో విషయమేమంటే ఇందులో దాదాపు ఐదొంతులు హైదరాబాదు నుండే కాస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పోర్చుగల్ దేశంలో పందేలకు చట్టబద్దత ఉంది. ఈ నేపథ్యంలో ఐపిఎల్ 6 బెట్టింగులకు అదే కేంద్రంగా మారిందట.
గతేడాదితో పోల్చితే బెట్టింగులు ఇరవై ఐదు శాతం పెరిగాయంటున్నారు. ఈసారి ముంబయి, బెంగళూరు, కోల్కతా జట్లలో ఏదో ఒకటి విజేతగా నిలుస్తుందని బెట్టింగ్స్ ఎక్కువగా కాస్తున్నారట. ఐపిఎల్కు ఏటా మార్కెట్ పెరుగుతున్నట్లుగానే బెట్టింగ్స్ టర్నోవర్ కూడా అదే విధంగా పెరుగుతోందట.
ఐపిఎల్ 6 పందేల్లో వైట్ కాలర్ ఉద్యోగులే ఎక్కవగా ఉన్నారట. హైదరాబాదులోని పలు ప్రాంతాల నుండి ఈ బెట్టింగ్స్కు కేంద్రాలుగా మారినట్లు చెబుతున్నారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోను భారీగా బెట్టింగ్స్ సాగుతున్నాయట. హైదరాబాద్ నగరం బూకీలకు మంచి కేంద్రంగా మారిందట.
ఐపిఎల్పై ఉగ్ర కన్ను!
ఐపిఎల్ 6 మ్యాచులకు ఉగ్రవాదుల ముప్పు ఉన్నట్లుగా నిర్వాహకులకు హెచ్చరికలు అందినట్లుగా సమాచారం. అమెరికాలోని బోస్టన్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో నిఘా వర్గాలు, నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. వేదికల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.