బోస్టన్లో ఉగ్రవాద దాడి: ముగ్గురు మృతి, హైఅలర్ట్
బోస్టన్లో ఓ మారథాన్ నిర్వహించారు. ఈ మారథాన్ ముగింపు రేఖ చేరుతుండగా పేలుళ్లు జరిగాయి. ప్రమాదంలో గాయపడినవారిని హుటాహుటిన మాసాచూసెట్స్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో మరో రెండు బాంబులు వెలుగు చూశాయి. వాటిని నిర్వీర్యం చేశారు.
బాధితులకు అవసరమైన చికిత్స ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన అందించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించారు. బోస్టన్ బాంబు పేలుళ్లు అమెరికా స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపాయి. మార్కెట్ నష్టాల బాటలో నడిచింది. జంట పేలుళ్ల నేపథ్యంలో అమెరికాలో హై అలర్ట్ ప్రటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బోస్టన్ జంట పేలుళ్ల ఘటనపై మాసాచుసెట్స్ గవర్నర్, బోస్టన్ మేయర్ సమీక్షిస్తున్నారు. పేలుళ్ల ఘటన నుంచి ఒబామా ఖండించారు. పేలుళ్ల అనంతరం ఆయన శ్వేత సౌధం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పేలుళ్లపై విచారణ జరిపించి, అందుకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తామని ఒబామా హామీ ఇచ్చారు. పేలుళ్ల అనంతరం చేపట్టిన సహాయక చర్యలపై ఆయన మాసాచుసెట్స్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సంఘటనా స్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. కాళ్లు పోయినవారున్నారు. కొంత మంది స్పృహ తప్పి పడిపోయారు. మృతుల్లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. బాధితుల కోసం అమెరికా ప్రజలు ఈ రాత్రి ప్రార్థనలు చేస్తారని ఒబామా చెప్పారు. ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే, స్వదేశానికి సంబంధించిన శక్తులా, విదేశీ శక్తులా అనేది తెలియడం లేదు.