జగన్ హవా తగ్గుతోందని తేలింది: సిఓటరు సర్వేపై బాబు
అది మూడో ఫ్రంటో లేక నాలుగో ఫ్రంటో కావొచ్చన్నారు. ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం ఎన్డీయే, యూపీఏ యేతర కూటమే అన్నారు. సి వోటర్ సర్వేపై మంగళవారం రాత్రి టైమ్స్ నౌ నిర్వహించిన చర్చలో చంద్రబాబు ఫోన్ ద్వారా పాల్గొన్నారు. 'గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా అదే చేయనున్నారా? ఇతర పార్టీలతో టచ్లో ఉన్నారా?' అని ప్రశ్నించగా... 'ఔను! ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం' అని చంద్రబాబు తెలిపారు.
"గతంలో మేం నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కూటములను సమర్థంగా నిర్వహించాం. అన్ని పార్టీలను కలిపి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో కూడా ప్రాంతీయ పార్టీలదే ప్రధాన పాత్ర అవుతుంది. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోనూ మాదే అధికారం'' అని చంద్రబాబు చెప్పారు.
జాతీయ స్థాయిలో 1996, 1998 నాటి పరిస్థితులు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. "2700 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. లక్షల మంది ప్రజలను కలిశాను. వారి సమస్యలను వింటున్నా'' అని చంద్రబాబు తెలిపారు. జాతీయ నాయకులకంటే ప్రాంతీయ పార్టీల నేతలే నయమని తెలిపారు.