పురంధేశ్వరికి ఎర్త్: విశాఖ సీటుపై మళ్లీ టిఎస్సార్ కాక
పార్టీ అధిష్టానం టిక్కెట్ తనకే ఇస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. తాను అందరికీ ఆమోదయోగ్యమైన, అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పారు. విశాఖపట్నం తనదే అన్నారు. అయితే, అధిష్టానం నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం విశాఖ నుండి ప్రాతనిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి నరసారావుపేట నుండి పోటీ చేస్తారని చెప్పారు.
కేంద్ర మంత్రి, ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరికి కాంగ్రెసు సీనియర్ నేత టి. సుబ్బిరామిరెడ్డి నుంచి తిప్పలు తప్పడం లేదు. విశాఖపట్నం లోకసభ స్థానం కోసం టియస్సార్ పట్టు వీడేట్లు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి తాను పోటీ చేయాలని టి. సుబ్బిరామి రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు.
విశాఖ నుండే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన ఆయన మరోసారి ఇదే విషయాన్ని చెప్పారు. ఇందుకోసం ఆయన అక్కడే పర్యటిస్తూ తన వర్గాన్ని ఏకతాటి పైకి తీసుకు వస్తున్నారట. శివరాత్రి సందర్భంగా విశాఖ తీరంలో ఆయన భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.