పట్టువస్త్రాలు సమర్పించిన కిరణ్: మంత్రికి చేదుఅనుభవం
ఖమ్మం/హైదరాబాద్: భద్రాచలంలోని మిథాల ప్రాంగణంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలంలో మిథిలా ప్రాంగణంలో కల్యాణం జరిగింది. సీతారాముల కల్యాణం అభిజిత్ లగ్నాన వేద పండితులు సీతారాములకు మాంగల్య ధారణ చేశారు. భద్రాద్రికి భక్తులు పోటెత్తారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణానికి మంత్రులు రామచంద్రయ్య, రాంరెడ్డి వెంకట రెడ్డి, బాలరాజు, కేంద్రమంత్రి బలరాం నాయక్ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్లిన మంత్రి బాలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలంతో పాటు కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కల్యాణానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. విజయనగరం జిల్లా రామతీర్థలోని కల్యాణానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
హైదరాబాదులో ర్యాలీ
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. రామాలయాలు, హనుమాన్ మందిరాలతో పాటు ఇతర ఆలయాలు రామయ్య పెళ్లి వేడుకలతో కళకళలాడుతున్నాయి. మరోవైపు గౌలిగూడ నుండి రాంకోఠి వరకు హనుమాన్ భక్తులు శోభా యాత్రను ప్రారంభించారు.