విధులకు సబిత దూరం: కళంకితుల కొనసాగింపు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో సమావేశమైన తర్వాత వారి విషయంలో అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ కళంకిత మంత్రుల విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. పైగా, వారిని యధాతథంగా కొనసాగించాలని భావిస్తోంది. వైయస్ జగన్ కేసులో ఇరుక్కున్న మోపిదేవి వెంకటరమణ రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించారు. కానీ, ఆ తర్వాత అందుకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి శాఖ మార్చినా, ఆమెకు ఉద్వాసన పలికినా దాని ప్రభావం ప్రభుత్వంపై పడవచ్చునని భావించి, చర్యలకు అధిష్టానం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వీరిద్దరి చేత రాజీనామాలు చేయిస్తే, మరో ముగ్గురు మంత్రులపై కూడా చర్యలు తీసుకోవాల్సి రావచ్చునని, అది ఒక గొలుసుకట్టు వ్యవహారంగా మారుతుందని అధిష్టానం భావిస్తోంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వివాదాస్పద జీవలు జారీ చేసిన వ్యవహారంలో మంత్రులు గీతారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్యలను కూడా సిబిఐ నిందితులుగా చేర్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులపై చర్యలు తీసుకోకపోతే మిగతావారి విషయంలో కూడా అదే పద్ధతిని అనుసరించడానికి వీలవుతుందని అంటున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో పూర్తిగా సిబిఐ అన్ని చార్జిషీట్లను దాఖలు చేసిన తర్వాత కళంకిత మంత్రులపై ఒకేసారి చర్యలు తీసుకోవచ్చునని అధిష్టానం భావిస్తోంది.
గత వారం నుంచి సబితా ఇంద్రారెడ్డి విదులకు హాజరు కావడం లేదు. సచివాలయంలో కూడా కనిపించడం లేదు. ధర్మాన ప్రసాదరావు ఆరు నెలల పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు, విధులకు దూరంగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా చెప్పినా ఆయన వినలేదు. ఇటీవలి కాలంలో ఆయన విధులకు హాజరవుతున్నారు. అయితే, రోడ్లు, భవనాల మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు క్రమం తప్పకుండా ఫైళ్లను చూడకున్నా పెద్దగా ప్రభావం చూపదు. కానీ హోం మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఎప్పటికప్పుడు నిరంతరం ఫైళ్లను చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ సబితా ఇంద్రారెడ్డి శాఖను కూడా మార్చే అవకాశాలు లేవని అంటున్నారు.