జగన్ ఫోన్ చేయలేదు: బాలినేని, ఈనాడుపై ఫైర్
వివాదాస్పదమైన 26 జీవోల జారీకి మంత్రివర్గమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. జీవోలు జారీ చేసిన మంత్రులను బయటపెట్టి, వాటితో ఏ సంబంధం లేని తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను అరెస్టు చేశారని ఆయన విమర్శించారు. బయ్యారం గనుల విషయంలో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. జగన్కు, ఓఎంసి యజమాని గాలి జనార్దన్ రెడ్డికి సంబంధం ఉందని అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు.
ఈనాడు రాగం, సిబిఐ తాళం, ఈడి పల్లవి పాడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలనే ఈనాడు ప్రచురిస్తోందనే విషయం అందరికీ తెలుసునని బాలినేని అన్నారు. ఈనాడు ప్రచురించిన వార్తలనే సిబిఐ, ఈడి అధికారులు సైతం వల్లిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ బయటకు రాకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
తమ పార్టీకి అనుకూలంగా ఇండియాటుడే సర్వే ఇచ్చిందని చెబుతూ ఆ సర్వేను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎందుకు ప్రచురించలేదని, టైమ్స్ నౌ సర్వేనే ఎందుకు ప్రచురించాయని, ఎల్లో మీడియాతో సర్వే నిర్వహించేందుకు సిద్ధమేనా అని ఆయన అడిగారు. ఓబుళాపురం గనుల పర్మిట్ల విషయంలో నిబంధనలను ఉల్లంఘించిందని, అందుకే వాటిని రద్దు చేశామని, దీనిపై తెలుగుదేశం, కాంగ్రెసు అసత్యప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీలో ఉంటే జగన్ను అరెస్టు చేసేవారా అని బాలినేని అడిగారు. మంత్రులు చేతకానితనంతో మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ఏ రోజు కూడా మంత్రులతో మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. గాలి జనార్దన్ రెడ్డితో వైయస్ జగన్కు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. జగన్ను ఇరికించేందుకు ఎల్లో మీడియా కుట్ర చేసిందని ఆయన అన్నారు.