వైయస్ హయాంలో కెసిఆర్ ఏం చేశాడు: నామా
బయ్యారం, ఓబుళాపురం గనులపై తాము నాలుగేళ్లు పోరాడమని, పార్లమెంటులో బయ్యారంపై చర్చ జరుగుతుంటే కెసిఆర్ మాట్లాడలేదని నామా నాగేశ్వర రావు అన్నారు. కెసిఆర్ ఎవరితో కుమ్మక్కయ్యారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పారని ఆయన గుర్తు చేశారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపించాలని తాము ముఖ్యమంత్రిని కోరామని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన చెప్పారు. ఉక్కు టన్ను కూడా ఇనుప ఖనిజాన్ని తరలించడానికి అంగీకరించబోమని, తరలించే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని ఆయన చెప్పారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు.
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనేది తమ నినాదమేనని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బయ్యారం గనులను వైయస్ రాజశేఖర రెడ్డి తన అల్లుడు అనిల్ కుమార్కు కట్టబెడితే తెరాస ఎందుకు మాట్లాడలేదని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో తెరాస ఏం చేసిందని ఆయన అడిగారు. బయ్యారంలోని ఇనుప ఖనిజంపై జారీ చేసిన జీవోపై స్పష్టత ఇవ్వాలని తాము ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.
వైయస్ రాజశేఖర రెడ్డి తన అల్లుడు అనిల్కు చెందిన రక్షణ స్టీల్స్కు లక్షా 40 వేల ఎకరాల బయ్యారం గనులను కట్టబెట్టారని టిడిపి శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. దీనిపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారని గుర్తు చేశారు. తన ఆస్తులపై జగన్ ప్రకటన చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.