బయ్యారం సెగ: బొత్సపై గండ్ర, మంత్రి రాంరెడ్డి ఫైర్
బయ్యారం ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ పెట్టాల్సిందే అని, బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలానేది తెలంగాణ ప్రజల డిమాండ్ అని ఆయన అన్నారు. రూ.4 వేల కోట్ల వ్యయంతో సమీకృత ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని విపక్షాలు రాజకీయం చేయడం తగదని గండ్ర అన్నారు.
ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర వహించాలే తప్ప రాజకీయాలు చేయడం తగదని ఆయన అన్నారు. అన్న జైలులో ఉన్నందున పార్టీ బతుకుతుందో లేదో అనే భయంతో షర్మిల పాదయాత్ర చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిరాశానిస్పృహలతో పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.
బయ్యారం గనులపై బొత్స చేసిన వ్యాఖ్యలను మంత్రి రాంరెడ్డి వెంకట్రెడ్డి తప్పుబట్టారు. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. బయ్యారం గనుల వ్యవహారంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. సిపిఐ శాసనసభ్యురాలు చంద్రావతి తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.