ఇప్పటి దాకా ఓపికపట్టా... ఊరుకోను: కెసిఆర్పై బాబు
తెరాస వల్లే రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని, అవినీతిపై మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదని మండిపడ్డారు. అవినీతిపై మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా నిద్రలేచి రంకెలేస్తోందన్నారు. ఇప్పటి వరకూ ఆ పార్టీ పేరు చెప్పకుండా సాదాసీదాగా మాట్లాడానని, అందుకే తనపై విరుచుకుపడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వారికి ఎప్పుడో ఒకసారి ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయన్నారు.
వైయస్ హయాంలో ఎప్పుడూ అవినీతి గురించి మాట్లాడలేదన్నారు. బయ్యారంలో వైయస్ అల్లుడికి గనులు ధారాదత్తం చేస్తే అప్పుడు తెరాస మౌనంగా ఉందని ఆరోపించారు. టిడిపి ఈ విషయాన్ని అప్పుడే వెల్లడించిందని, ఎక్కడ గనులుంటే అక్కడే కర్మాగారాలు పెట్టాలని డిమాండ్ చేసిందన్నారు. గిరిజనులకు పూర్తిగా ఉపాధి కల్పించాలని బయ్యారంలో తాము ఆందోళన కూడా చేపట్టామని గుర్తుచేశారు.
అప్పుడు నిద్రపోయిన తెరాస, ఇప్పుడు టిడిపిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ చెబుతున్నదొక్కటేనని, అది పూర్తిగా బ్లాక్మెయిల్ పార్టీ అని, సూట్కేసుల పార్టీ అని ధ్వజమెత్తారు. 2009లో ఎన్నికల పొత్తు అంటూ తన దగ్గరకు వస్తే టిడిపి సీట్లు ఇచ్చామని, అయినా ఆ పార్టీ గెలవలేకపోయిందని చెప్పారు. సూట్కేసులు తీసుకొని రాజకీయాలు చేస్తున్నది తెరాస తప్ప తెలుగుదేశం కాదన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తాము కృషిచేస్తుంటే, ఆ పార్టీ సూట్కేసులతో రాజకీయం చేస్తోందని పేర్కొన్నారు. ఫాంహౌస్లో ఆరు నెలల పాటు కుంభకర్ణుడిలా నిద్రపోయిన కెసిఆర్ ఇప్పుడే నిద్రలేచి విమర్శలు చేస్తున్నారన్నారు. తానింత వరకు తెరాసపై సాదాసీదాగానే విమర్శించానని, టిడిపిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నందుకే తీవ్రంగా మాట్లాడాల్సి వస్తోందన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జైలు పార్టీ అన్నారు. వైయస్ వేలు, లక్షళ కోట్ల కుంభకోణాలకు పాల్పడి రాష్ట్ర పరువు మంట గలిపారన్నారు. అవినీతి జరిగినట్లు సిబిఐ తేల్చిందని, వైయస్కు వెన్నంటి ఉన్న సూరీడే ఆ విషయాన్ని అంగీకరించారన్నారు. బైబిల్ గానీ, భగవద్గీత గానీ, ఖురాన్ గానీ దాచుకొని దోచుకోమని చెప్పలేదన్నారు.