తారల ఎన్ని'కలలు': ప్రచారంలో ముద్దుగుమ్మ(పిక్చర్స్)
బెంగళూరు: కర్నాటక సాధారణ ఎన్నికల బరిలో కోలీవుడ్లో వెలుగొందిన నటీనటులు కూడా నిలిచారు. సాధారణంగానే సినీ తారలంటే జనాలకు ఎంతో ఆసక్తి. తమ అభిమాన నటులు రాజకీయాల్లోకి వస్తే అభిమానులకు పండుగే. తమ నటులు ఉన్నత స్థానాలలో ఉండాలని అభిమానులు కోరుకుంటారు. కన్నడ నాట ముగ్గురు నటీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ప్రముఖ నటుడు అంబరీష్ మాండ్య స్థానంనుండి పోటీ చేస్తున్నారు. ఆయన రెబల్ స్టార్గా వెలుగొందారు. ఇతను అసెంబ్లీకి వెళ్లేందుకు తహతహలాడుతున్నారు. అంబరీష్ గెలుపు కోసం ఆయన సతీమణి, ప్రముఖ సినీ నటి సుమలత జోరుగా ప్రచారం చేస్తున్నారు. అంబరీష్ మూడుసార్లు ఎంపీగా, ఓసారి కేంద్రమంత్రిగా పని చేశారు. కానీ ఇప్పటి వరకు అతను అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. గత ఎన్నికల్లో మైసూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు.
యాభై ఆరేళ్ల నటి ఉమాశ్రీ కాంగ్రెసు పార్టీ తరఫున రెండోసారి బరిలోకి దిగుతున్నారు. అమె గత ఎన్నికల్లో తెరడాల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అక్కడి నుండే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో నటి పూజా గాంధీ బిఎస్సార్ పార్టీ నుండి తొలిసారి బరిలోకి దిగుతున్నారు. సంవత్సరకాలంలో ఆమె మూడు పార్టీలు మారారు. ఈమె రాయచూర్ నుండి బరిలోకి దిగుతున్నారు.
మరో నటి రక్షితకు కూడా బిఎస్సార్ పార్టీ టిక్కెట్ ఇచ్చినప్పటికీ ఆమె ఆ పార్టీని వదిలి వెళ్లిపోయారు. టాలీవుడ్ మెగాస్టార్, కేంద్రమంత్రి చిరంజీవి కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేయవచ్చు. కన్నడ నాట ఎన్నికల్లో ముగ్గురు తారలే నిలిచినప్పటికీ ప్రచారంలో మాత్రం పలువురు పాల్గోనున్నారు. కాంగ్రెసు పార్టీ తరఫున రమ్య, బిజెపి తరఫున తారలు ప్రచారం చేయనున్నారు. ఎన్నికల్లో ప్రచారం నిర్మాతలకు కష్టాలు తెచ్చిపెడుతోందట. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి సినిమాలను నిలిపివేయాలని ఈసికి ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే టీవిల్లోను వారి సినిమాలు ప్రసారం కాకుండా చేయాలని ఫిర్యాదు చేశారు.
యువ నటి పూజా గాంధీ బిఎస్సార్ పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ప్రముఖ నటి ఉమాశ్రీ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
నటుడు అంబరీష్ ఎంపీగా, కేంద్రమంత్రిగా పని చేశారు. అసెంబ్లీ మెట్లెక్కేందుకు ఉబలాటపడుతున్నారు.
రక్షితకు బిఎస్సార్ పార్టీ టిక్కెట్ ఇచ్చినా ఆమె ఆ తర్వాత పార్టీని వీడారు.
అంబరీష్ సతీమణి, నటి సుమలత ఆయన గెలుపు కోసం ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.
కన్నడ నాట చిరంజీవి ప్రచారం చేస్తారని నేతలు చెబుతున్నారు.