వైయస్సార్ కాదు, రోశయ్య: 'రక్షణ' జీవోపై జూపూడి
వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై పగ బట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి షర్మిల విసిరిన సవాల్కు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆయన అడిగారు. షర్మిల విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని ఆయన అన్నారు. ఎంపిఎండిసి గ్లోబల్ టెండర్లను పిలిస్తే వైయస్ ఏదో చేశారని గోల చేస్తున్నారని, ఆనాడు గ్లోబల్ టెండర్లలో తెలుగుదేశం పార్టీ ఎందుకు పాల్గొనలేదని ఆయన అన్నారు. రక్షణ స్టీల్స్ను కృష్ణా జిల్లాకు తరలించడానికి వైయస్ పథరం వేశారని రేవంత్ రెడ్డి అంటున్నారని, పొరుగు జిల్లా అంటే వరంగల్ అనేది జీవోలో ఉందని ఆయన అన్నారు. ఆరోపణలు చేసే ముందు కాస్తా హోం వర్క్ చేసుకుని రావాలని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డికి కనీస పరిజ్ఞానం లేదని ఆయన దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీది అవకాశవాద రాజకీయమని అన్నారు. అనిల్ కుమార్ మిత్రుడు కాబట్టి కొండలరావుకు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారని, అనిల్ కుమార్కు మిత్రులుండకూడదా అని ఆయన అన్నారు. నిజాలు తెలియకుండా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు మాట రేవంత్ రెడ్డి నోట వస్తోందని ఆయన అన్నారు.
వైయస్ జగన్ను ఇబ్బందులకు గురి చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఇప్పటికైనా వైయస్ కుటుంబంపై దుష్ప్రచారం మానుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణలో ఉక్కు కర్మాగారం రావాలని వైయస్ ఆశించారని ఆయన చెప్పారు. రక్షణ స్టీల్స్ తెలంగాణలో ఉక్కు కర్మాగారం పెట్టాడనికి ప్రయత్నించిందని, ఎంపిఎండిసికి లాభాలు తెచ్చే విధంగా వ్యవహరించిందని, రక్షణ స్టీల్స్ పెట్టదలుచుకున్న ప్లాంట్ ప్రయత్నాలను సర్వనాశనం చేశారని, ఇప్పుడు బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కొండల్ రావు చాలా కాంట్రాక్టులు తెచ్చుకున్నానని చెప్పారని ఆయన అన్నారు.
అబద్ధాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు వితండవాదం చేస్తున్నారని జూపూడి విమర్శించారు. షర్మిల విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక తెలుగుదేశం నాయకులు పిరికిపందలుగా పారిపోవడానికి అనిల్ కుమార్కు, కొండల్ రావుకు సంబంధాలు అంటగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.