బాలికపై రేప్: లంచం ఇవ్వజూపిన పోలీసు దొరికాడు
విశ్వసనీయ సమాచారం ప్రకారం - పోలీసు స్టేషన్లోని 13 మంది పోలీసుల ఫొటోలను బాలిక తండ్రికి చూపించారు. వారిలో తమకు లంచం ఇవ్వజూపిన పోలీసును అతను గుర్తించాడు. తండ్రి అందుబాటులో లేనందున నిందితుడ్ని గుర్తించలేకపోయామని ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ మంగళవారంనాడు చెప్పారు.
ఐదేళ్ల బాలికను ఈ నెల 15వ తేదీన అపహరించి, రెండు రోజుల పాటు బందీగా పెట్టుకుని ఆమెపై అత్యాచారం జరిపారు. బాలిక కుటుంబం నివసించే అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్లోనే నిందితులు కూడా ఉంటున్నారు. బాలిక అరుపులు విని ఆమెను ఈనెల 17వ తేదీన కుటుంబ సభ్యులు రక్షించారు.బాలికకు ఎయిమ్స్ చికిత్స అందిస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు బాలికను అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక స్పృహ తప్పిన తర్వాత కూడా ఆమెపై అత్యాచారం చేసినట్లు కేసులో రెండో నిందితుడైన 19 ఏళ్ల ప్రదీప్ కుమార్ చెప్పాడు. ప్రధాన నిందితుడు మనోజ్ కుమార్ తొలుత నిందలన్నీ ప్రదీప్ కుమార్పైనే వేయడానికి ప్రయత్నించాడు. ప్రదీప్ కుమార్, మనోజ్ కుమార్ ఇద్దరు బాలికపై దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఆత్యాచారం జరిపిన తర్వాత ఇద్దరు కూడా బీహార్లోని తమ సొంత పట్టణానికి పారిపోయారు. వారిని అరెస్టు చేసి పోలీసులు ఢిల్లీకి తీసుకుని వచ్చారు.