ఖాళీ ఉంది, వెళ్తే తప్పేంటి?: పురంధేశ్వరిపై టిఎస్సార్
గతంలో నర్సారావుపేట నియోజకవర్గాన్ని పురంధేశ్వరి ఆశించారని, ప్రస్తుతం అక్కడ ఖాళీగా ఉందని అక్కడకు వెళ్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తాను 2014 సాధారణ ఎన్నికల్లో విశాఖ లోకసభ స్థానం నుండే పోటీ చేస్తానని చెప్పారు. ఈ విషయమై వివాదాలు సృష్టించవద్దని ఆయన కోరారు.
తాను విశాఖలో చేసిన అభివృద్ధిని ఉత్తరం ద్వారా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి ఇటీవలె తీసుకు వెళ్లానన్నారు. గురువారం సోనియాను కలిశానని చెప్పారు. విశాఖ ప్రజలకు తాను ఎంతో చేశానన్నారు. తన రాజ్యసభ పదవి కాలం త్వరలో ముగుస్తుందని అందుకే విశాఖ నుండి పోటీ చేస్తానన్నారు. అక్కడ గెలిచే శక్తి తనకుందన్నారు.
కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ప్రస్తుతం విశాఖ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పురంధేశ్వరికి ముందు టి.సుబ్బిరామి రెడ్డి ఈ నియోజకవర్గం నుండి ప్రాతనిథ్యం వహించారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఈ నియోజకవర్గం టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.