ఈ చింతచెట్టు కింద కూర్చుంటే ఎమ్మెల్యేగా గెల్చినట్టే!
దీనికి కారణం ఆ చింత చెట్టు కింద కూర్చుంటే విజయం వరిస్తుందనే నమ్మకమే. ఈ చెట్టు గడగ్ జిల్లాలోని ముందర్గి తాలుకాలోని హేమరెడ్డి చౌరస్తాలో ఉంది. రోన్, శిరహట్టి నియోజకవర్గాల నుండి పోటీ చేసే అభ్యర్థులు పలువురు ఈ చెట్టు కిందే కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకోవడం, అక్కడే గ్రామంలోని పలువురి ఓటర్లను ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తుండటం చేస్తుంటారు. చెట్టు కింద గెలుపు వ్యూహాలు కూడా రచిస్తుంటారు.
గ్రామ పంచాయతీ నుండి ఎమ్మెల్యే వరకు ఎవరు పోటీ చేసినా పలువురు ఈ చెట్టు కింద కూర్చుంటారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు కోసం చెట్టు కింద సేద తీరుతున్నారు. ఈ చెట్టు కింద కూర్చుంటే గెలుస్తారనే నమ్మకం ఎస్ఎస్ పాటిల్ నుండి ప్రారంభమైంది.
కల్కేరి గ్రామానికి చెందిన పాటిల్ 1994 ఎన్నికల్లో జనతా దళ్ తరఫున పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఆయన చింతచెట్టు కింద కూర్చున్నారు. ఆ తర్వాత ఆ చింతచెట్టు కింద కూర్చుని ప్రచారం చేసిన అతను పలు ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఈ నమ్మకం పెరిగిపోయింది. పాటిల్ 2004 వరకు మూడుసార్లు గెలుస్తూ వచ్చారు.
వైయన్ గౌడ, వీరపక్ష గౌడ, రవింద్ర తదితరులు ఈ చెట్టు కింద కూర్చోవడం వల్లనే టౌన్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందినట్లుగా నమ్ముతుంటారు. పాటిల్ తర్వాత ఇతరులు గెలవడంతో ఈ చెట్టు కింద సేద తీరడం, ప్రచారం చేయడం చేస్తే గెలుస్తారనే భావన అభ్యర్థుల్లో మరింత నాటుకు పోవడంతో ఆ సెంటిమెంట్ పాటిస్తున్నారు.