వైయస్ చేవెళ్ల సెంటిమెంట్: విజయమ్మ రచ్చబండ
చేవెళ్లలో ఆమె స్థానికులనుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రచ్చబండ తర్వాత చేవెళ్లలో శనివారం సాయంత్రం బహిరంగ సభ జరుగుతుంది. అంతకు ముందు ఆమె చేవెళ్లకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. చేవెళ్లకు చేరుకోవడానికి ముందు ఆమె రాజేంద్రనగర్లోని ఆరె మైసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఆ తర్వాత మొయినాబాద్ మెథడిస్ట్ చర్చిలో విజయమ్మ ప్రార్థనలు చేశారు. విజయమ్మ వెంట ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి ఉన్నారు. చేవెళ్ల రచ్చబండ కార్యక్రమంలో శానససభ్యుడు కూన శ్రీశైలం, రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సినీనటి, పార్టీ నాయకురాలు రోజా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ధరలు పెరగలేదని వైయస్ విజయమ్మ చెప్పారు. ఆరోగ్యశ్రీ సక్రమంగా పనిచేసేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆమె విమర్శించారు. మంచినీళ్లు, విత్తనాలు, ఏవీ అందడం లేదని ఆమె అన్నారు. విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచారని, పిల్లల చదువులు ఆగిపోయాయని అన్నారు.
అమ్మహస్తం పెట్టినా దాని ద్వారా సరుకులు అందడం లేదని ఆమె అన్నారు. గ్యాస్ రేట్ విపరీతంగా పెంచారని విజయమ్మ అన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తారని ఆమె చెప్పారు. అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తారని విజయమ్మ చెప్పారు.