జూనియర్లు, తారకలే అవుతారు: టిడిపిపై కెసిఆర్ ఫైర్
వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో తెలంగాణ నాయకులు గులాంలుగానే ఉండాల్సి వస్తుందని ఆయన అన్నారు. మనకు ఆంధ్రా పార్టీలు వద్దని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ పేరుకే జాతీయ పార్టీ అని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగున్నర ఏళ్లు మాత్రమే తెలంగాణ నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆంధ్రా నాయకులే ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, స్పీకర్గా, మండలి చైర్మన్గా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రా ముఖ్యమంత్రులది అహంకార ధోరణి అని విమర్శించారు. శానససభలో హరీష్ రావుపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.
తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనని అంటే తెలంగాణ మంత్రులు, తెలుగుదేశం తెలంగాణ దద్దమ్మలు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. ఇటువంటి నాయకులు మనకు వద్దని ఆయన అన్నారు. ఆంధ్ర పార్టీల పెత్తనం కింద పనిచేసే పౌరుషం లేని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు వద్దని ఆయన అన్నారు. బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతానని ముఖ్యమంత్రి గోల్మాల్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఎవరు పెడతారో, ఎలా పెడతారో చెప్పకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రాణాలు పోయినా సరే ఒక్క తట్టెడు ముడి ఇనుమును కూడా పోనియ్యమని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసులు పెట్టి, సాయుధ పోలీసులను పెట్టి, గుండాలాగా పోతిరెడ్డిపాడుకు నీరు తరలించారని ఆయన ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా 138 టిఎంసిల నీటిని అక్రమంగా తరలించుకుని పోతున్నారని ఆయన అన్నారు. అనుమతి లేకుండా సోమశిల, కండలేరు వంటి ప్రాజెక్టులు కట్టారని, అక్రమంగా నీరు తరలిస్తున్నారని ఆయన అన్నారు. పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు చంద్రబాబును విశ్వసించబోరని ఆయన అన్నారు.
తెలంగాణలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సకల జనుల సమ్మె జరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే కృష్ణా, గోదావరి జలాల్లో తమ వాటా తాము తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులను పెండింగులో పెట్టి ఆంధ్ర ప్రాజెక్టులను ఈ రాష్ట్రంలో పూర్తి చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే ఐదేళ్లలో తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు సాగునీటిని అందించవ్చచునని ఆయన అన్నారు. తెలంగాణ నుంచి ఆదాయం ఎక్కువ వస్తోందని, పెత్తనం మాత్రం ఆంధ్రావాళ్లు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో అత్యధిక పార్లమెంటు, శాసనసభా స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో, కేంద్రంలో శాసించే స్థాయికి చేరుకుని తెలంగాణ సాధించకుందామని ఆయన అన్నారు. తెలంగాణ వస్తే అమలు చేసే పథకాలను ఆయన వివరించారు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరు
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు. ఈ మేరకు ఆయన సభలో రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమని కెసిఆర్ ఆనాడే చెప్పారని ఆయన గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్లపై తీర్మానాన్ని పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ప్రవేశపెట్టారు. వివిధ అంశాలపై సభలో తీర్మానాలను ఆమోదించారు.