చిరంజీవికో న్యాయం, బాబుకో న్యాయం: విజయమ్మ
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను వెలివేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసుల నుంచి తమ వైపు 15 మంది శాసనసభ్యులు వచ్చారని, దమ్ముంటే వారిపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడు ప్రజలు ఎవరిని వెలివేస్తారో తెలిసిపోతుందని ఆమె అన్నారు. ఏ ఎన్నికలైనా పెట్టండి, ప్రజలకు ఎవరి మీద అభిమానం ఉందో తెలిసిపోతుందని ఆమె అన్నారు.
తెలంగాణలో తమ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని ఆమె అన్నారు. తెలంగాణ కోసం వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులే తమకు శ్రీరామరక్ష అని ఆమె అన్నారు. తమ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. కిరణ్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమయిందని ఆమె విమర్శించారు. రంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా వికారాబాద్ లో జరిగిన కార్యక్రమంలో విజయమ్మ ప్రసంగించారు. రంగారెడ్డి జిల్లాతో వైఎస్సార్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఏ కార్యక్రమమైనా ఈ జిల్లా నుంచే ఆయన మొదలుపెట్టేవారని అన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం వైఎస్ ఎంతో తపించారన్నారు. తన పాలనలో వైఎస్సార్ పన్నులు పెంచలేదని గుర్తు చేశారు. వైఎస్సార్ పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదన్నారు. జనం బాధలు చంద్రబాబుకు పట్టడంలేదన్నారు. కాంగ్రెస్ తో కుమ్మక్కయి జగన్ను అన్యాయంగా జైల్లో పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్కు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు.