ఎప్పుడైనా సిద్ధమన్న విజయమ్మ: గుడ్డు విసిరిన వ్యక్తి
స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. సాయంత్రం వికారాబాద్లో జరిగిన బహిరంగ సభలో కిరణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వంలో ఉన్నవారు తమ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, జగన్ను ఉరి తీయాలని, తమ కుటుంబాన్ని వెలి వేయాలని డిమాండ్ చేస్తున్నారని, ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు ఎవరిని ఉరి తీస్తారో.. ఎవరిని వెలి వేస్తారో తేలిపోతుందన్నారు.
కిరణ్ రాష్ట్ర ప్రజలకు కొత్తగా ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. అమ్మ హస్తం ఒక మాయా హస్తమని, ఇప్పటికే ఇస్తున్న సరుకులకు కొన్ని గ్రాముల ఉప్పు, పసుపు, కారం కలిపి ఇస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీగా ప్రచారం చేసుకుంటున్నారని సిఎంను ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పేరుతో కిరణ్ తనకు తానే దళిత బంధువునని చెప్పుకొని తిరుగుతున్నారని విమర్శించారు.
రాజీవ్ యువ కిరణాల పేరిట లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ, కరెంటు కోతల కారణంగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో సీఎంలుగా పని చేసిన వారిలో చంద్రబాబే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని విమర్శించారు. చంద్రబాబు వంటి అవినీతిపరుడు మరొకరు లేరని, తన పార్టీ నేతలు నామా నాగేశ్వర రావు, సుజన చౌదరి, సిఎం రమేష్ వంటి వారికి రాష్ట్రాన్ని దోచిపెట్టారని విమర్శించారు.
సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిందని, మనిషికో రకంగా న్యాయం చేస్తోందని ఆరోపించారు. కిరణ్ సర్కారు ధరల దరువు ప్రభుత్వంగా మారిందని విజయలక్ష్మి విమర్శించారు. జగన్ అధికారంలోకి వస్తే వైయస్సార్ హయాంలోని పథకాలను తిరిగి అమలు చేస్తామని చెప్పారు. ప్రజల ఇబ్బందులు తొలగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని, అప్పుడే మంచి రోజులు వస్తాయని విజయమ్మ చెప్పారు. కాగా, విజయమ్మ ప్రసంగిస్తుండగా జై తెలంగాణ అంటూ ఓ యువకుడు కోడిగుడ్డు విసిరారు. అది విజయమ్మ ఉన్న వాహనానికి కొద్ది దూరంలో పడింది.