చిరు ప్రచారంలో టెన్షన్: రాళ్ల వర్షం, లాఠీఛార్జ్, ఫ్యాన్స్కు గాయాలు
బెంగళూరు: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఆదివారం పాల్గొన్నారు. చిరంజీవి పావగడ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అవినీతి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెసు పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని చిరంజీవి అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు ఖనిజ సంపదను దోచుకున్నారని ఆరోపించారు.
చిరంజీవి ప్రచార ర్యాలీకి భారీగా ప్రజలు హాజరయ్యారు. ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలి రావడంతో వారిని ఆపడం పోలీసుల తరం కాలేదు. చిరును చూసేందుకు ముందుముందుకు వచ్చే ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన అభిమానులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. చిక్ బళాపూర్ ఎన్నికల ప్రచారానికి భారీగా అభిమానులు వచ్చారు. తొక్కిసలాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అభిమానులకు గాయాలయ్యాయి.
ముగ్గురికి కాదు నలుగురికి దర్శన్ ప్రచారం
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ ముగ్గురుకి కాదు నలుగురి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్, బెళగావి జిల్లా కిత్తూరులోని జెడిఎస్ అభ్యర్థి ఆనందం అప్పుగోళ్, బెంగళూరులోని మహదేవపురం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద లింబావళి తరఫున ఆయన ప్రచారం చేయనున్న విషయం తెలిసిందే.
వీరికే కాకుండా ధార్వాడ్ నియోజకవర్గం కాంగ్రెసు పార్ట అభ్యర్థి వినయ్ కులకర్ణి కోసం కూడా దర్శనం ప్రచారం చేయనున్నారు. జెడిఎస్ అభ్యర్థి అప్పుగోళ్... దర్శన్ ఇటీవల నటించిన సంగొళ్లి రాయన్న చిత్ర నిర్మాత. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నలుగురి తరఫున దర్శనం ప్రచారం చేయడం చర్చకు దారి తీసింది.
కాగా, కన్నడనాట కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ఇప్పటికే ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, టిజి వెంకటేష్, గల్లా అరుణ కుమారి, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లాతో పాటు ఎంపీలు అనంత వెంకట్రామి రెడ్డి, సురేష్ షేట్కార్, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు షాజహాన్, మస్తాన్ వలీ ప్రచారం నిర్వహించనున్నారు.