జగన్ వర్గం ఎంపికి ఝలక్: అనకాపల్లిపై జయప్రద కన్ను
అయితే రాజమండ్రి టిక్కెట్ పైన ఏ పార్టీ నుండి ఆమెకు హామీ రాలేదని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలిశారు. ఆమె వద్ద నుండి కూడా రాజమండ్రి టిక్కెట్ పైన హామీ రాలేదని సమాచారం. కర్నాటక లేదా ఆంధ్రప్రదేశ్ నుండి మరో నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆమె సూచించారని చెబుతున్నారు.
ఏ పార్టీ నుండి రాజమండ్రి టిక్కెట్ పైన హామీ రాకపోవడంతో ఆమె తిరిగి తిరిగి కాంగ్రెసు గూటికే చేరుతున్నారని అంటున్నారు. మరో నియోజకవర్గాన్ని చూసుకోవాలని సోనియా చెప్పడంతో ఇప్పుడు ఆమె దృష్టి అనకాపల్లి నియోజకవర్గంపై పడ్డాయనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంటు సభ్యుడుగా సబ్బం హరి అన్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎంపీగా ఉన్నారు.
2014 ఎన్నికల్లో ఆయన జగన్ పార్టీ నుండే పోటీ చేస్తారు. దీంతో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా జయప్రద బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. జయప్రద కూడా ఆ నియోజకవర్గం గురించి ఆరా తీస్తున్నారని సమాచారం. జగన్ కోసం సబ్బం హరి 2014లోగా ఎప్పుడైనా పార్టీని వీడుతారు. కాంగ్రెసులో ఉంటున్నప్పటికీ ఆయన పార్టీని విమర్శిస్తూ జగన్కు మద్దతు పలుకుతున్నారు.
ఈ నేపథ్యంలో జయప్రదకు టిక్కెట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. తాను రాజమండ్రి టిక్కెట్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నాననే వాదనలో పస లేదని జయప్రద కొట్టి పారేస్తున్నారట. జగన్కు మద్దతిస్తున్న సబ్బం హరిపై జయప్రదను పోటీకి దింపితే తమకే గెలుపు అవకాశాలు ఉంటాయని, తద్వారా ప్రత్యర్థి పార్టీని దెబ్బ తీయవచ్చుననే అభిప్రాయం కాంగ్రెసులో కూడా ఉందంటున్నారు. అనకాపల్లిలో జయప్రద పోటీ చేస్తే సబ్బం పైన గెలుపొందటమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల పైన కూడా ప్రభావం పడనుందంటున్నారు.