ఢిల్లీలో తెలంగాణ ర్యాలీ టెన్షన్: మంత్రి సునీత ఆవేదన
అంతకుముందు దీక్ష ముగింపు సందర్భంగా ఐకాస చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ... రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొడితే ఊరుకునేది లేదన్నారు. ధర్నాకు ఎంతోమంది జాతీయ నాయకులు వచ్చి మద్దతు తెలిపారని, కేంద్రం దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
బయ్యారంతో తెలంగాణకే లాభం: సునీత రెడ్డి
బయ్యారం గనుల కేటాయింపుతో తెలంగాణ జిల్లాలకే లాభమని మంత్రి సునీత లక్ష్మా రెడ్డి హైదరాబాదులో అన్నారు. మెదక్ జిల్లా పిలుపుకు తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునివ్వడం బాధాకరమన్నారు. సంగారెడ్డి సభకు కిరాయి మనుషులను తెచ్చారని తెరాస ఆరోపిస్తోందని, ఇటీవల ఆర్మూర్లో జరిగిన తెరాస ఆవిర్భావ సభకు కూడా ఆ పార్టీ జనాన్ని తరలించిందా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న పనుల కారణంగానే ప్రజలు తమంతట తామే వచ్చారన్నారు.
బంగారు తల్లి పథకానికి చట్టబద్దత కల్పిస్తామని సునీత రెడ్డి చెప్పారు. ఆడపిల్ల భారం కాదని బాధ్యత అని నిరూపిస్తామన్నారు. ఈ పథకానికి చట్టబద్దత కల్పిస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ పథకం ఉంటుందని ఆమె చెప్పారు. ఈ పథకానికి రూ.200 కోట్లు ఖర్చవుతాయన్నారు.
మేలో భూకంపం సృష్టిస్తా: హరీష్ రావు
బయ్యారం గనుల వ్యవహారంలో ముఖ్యమంత్రికి తెరాస సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు సవాల్ విసిరారు. బయ్యారం ఉక్కును విశాఖకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకోకుంటే మేలో కచ్చితంగా భూకంపం సృష్టిస్తామన్నారు. బయ్యారం ఉక్కును జబర్దస్తిగా ఆంధ్రాకు తరలిస్తామన్నప్పటికి మంత్రులు స్పందించడం లేదని మండిపడ్డారు. ఇది మంత్రులకు సిగ్గుచేటన్నారు.