సోనియాకు వినిపించాలి: టి కాంగ్ ఎంపీలతో నటి స్మృతి
శ్రీకృష్ణ కమిటీ తప్పుడు నివేదికను ఇచ్చిందని అగ్నివేష్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు తెలంగాణ ఇస్తేనే కాంగ్రెసు బతుకుతుందని, లేదంటే రెండు ప్రాంతాల్లోను ఆ పార్టీకి మనుగడ కష్టమే అన్నారు.
తెలంగాణలో అన్ని రకాల వనరులు ఉన్నాయని ఉమాభారతి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంతోనే ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలను ఇచ్చిందని, 2014లో అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందన్నారు. తెలంగాణ కోసం అందరు కలిసి పోరాడాలన్నారు. తెలంగాణ నినాదాల హోరు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెవులకు చేరాలని నటి, బిజెపి ఎంపి స్మృతి ఇరానీ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని సుష్మా స్వరాజ్ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ ఐకాస దీక్ష వద్ద అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ ఇస్తుందన్నారు. కాంగ్రెసు తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే బిజెపి మద్దతిస్తుందన్నారు. యుపిఏపై అవిశ్వాసం పెట్టే విషయమై ఆలోచిస్తామన్నారు. మరోవైపు తెలంగాణ ఎంపీల ఆందోళనకు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
సోనియా ఇంటి వద్ద ఉద్రిక్తత
అంతకుముందు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సోనియా గాంధీ ఇంటిని ముట్టడించే ప్రయత్నాలు చేశారు. ఈ విషయం ముందుగానే తెలియడంతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పలువురు ఉద్యోగ సంఘాల నేతలు సోనియా ఇంటి వైపుకు వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తాము సోనియాను కలుస్తామన్నారు. ఒక్కరిని పంపించేందుకు పోలీసులు అంగీకరించడంతో శ్రీనివాస్ గౌడ్ వెళ్లారు.
అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 2014లోపు తెలంగాణ ఇవ్వాలని తాము సోనియాను కోరామని, తెలంగాణ ఇవ్వకుంటే ఒక్క సీటును కూడా గెలుచుకోలేరని, ఇస్తే అందర్నీ గెలిపిస్తామని తాను చెప్పానని అన్నారు.