దళిత బంధువు కాదు, రాబందు: సిఎంపై శంకరన్న
తనను మంత్రి మండలి నుంచి తొలగించడం వల్ల, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను అవమానించడం వల్ల దళితులు కాంగ్రెసు పార్టీకి దూరమవుతున్నారని ఆయన అన్నారు. పోలీసులు ఎవరిని పడితే వారిని వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు మజ్లీస్ నేతలు ఓవైసీ సోదరులను వేధించడం వల్ల మైనారిటీలు కాంగ్రసుకు దూరమవుతున్నారని ఆయన అన్నారు. పన్నెండేళ్ల క్రితం నాటి కేసు తవ్వి తీసి అసదుద్దీన్ ఓవైసీని వేధిస్తున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన సేవ చేయకపోయినా అదృష్టం కొద్దీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఏ తప్పూ చేయకపోయినా గ్రీన్ఫీల్డ్ అంశంపై తనను వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ అంశంపై సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రచందనం స్మిగ్లింగ్, డిజిపి నియామకంపై కూడా సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు.
పార్టీని నమ్ముకున్నవాళ్లను కిరణ్ కుమార్ రెడ్డి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వివాదాస్పద జీవోలు జారీ చేసిన కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.