భారతి సెంటిమెంట్: సిబిఐపై భార్యల నిలదీత వెనుక..!
సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా భారతి సిబిఐ డిఐజిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. రూ.లక్ష కోట్లకు వారసులైతేనే పిల్లలా? ఇతరులు కాదా? అని ప్రశ్నించింది. పులివెందులలో అరాచకాలకు, అక్రమ కేసులకు తమ కుటుంబం కారణం కాదని బైబిల్ పైన లేదా పిల్లల పైన ప్రమాణం చేసి భారతి చెప్పగలరా అని సవాల్ చేశారు. విచారణ సంస్థను ప్రభావితం చేసేందుకేనా అని టిడిపి ప్రశ్నిస్తోంది.
కాగా, జగన్ కేసులో మొన్న భారతి, నిన్న ఆశా ప్రసాద్ సిబిఐని ప్రశ్నించినట్లుగా వార్తలు వచ్చాయి. సిబిఐ అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినేందుకు రకరకాల వ్యూహాలు అమలు చేసిన నిందితులు తాజాగా సెంటిమెంట్ అస్త్రాలు సందిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది.
సోమవారం జగన్ భార్య భారతి సిబిఐ అధికారి వెంకటేశ్ను నిలదీసినంత పని చేశారు. జగన్ అవినీతికి పాల్పడ్డారా? ఒట్టేసి చెప్పండని ప్రశ్నించారని వార్తలు వచ్చాయి. మంగళవారం నిమ్మగడ్డ సతీమణి ఆశా ప్రసాద్ అదే పని చేశారు. అచ్చం భారతిలాగానే ఆశా కూడా పుస్తకంతో కోర్టు హాలులోకి ప్రవేశించారు. చేతన్ భగత్ రాసిన '2 స్టేట్స్' అనే ఆ ప్రేమ కథాంశ పుస్తకాన్ని కొద్దిసేపు చదివారు.
నిమ్మగడ్డకు బెయిల్ ఎందుకు ఇవ్వరాదో సిబిఐ తరఫు లాయర్ చెబుతుండగా ఆమె తిట్లు, శాపనార్థాలు పెడుతూ కూర్చున్నారు. పక్కనే ఉన్న సన్నిహితులు ఆమెను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె ఆక్రోశం ఆపుకోలేకపోయారు. అంతకు ముందు బయట వరండాలో సిబిఐ అధికారి వెంకటేశ్ను ఆమె నిలదీశారు. తమకు పిల్లలు ఉన్నారని, మీకు పిల్లలు లేరా? అని అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. వెంకటేశ్ దీనిపై పెద్దగా స్పందించకుండా అంతా న్యాయస్థానాలు చూసుకుంటాయంటూ కోర్టు లోపలికి వెళ్లిపోయారు.