తీవ్ర పరిణామాలు: అధిష్టానానికి టిఎంపీల అల్టిమేటం
రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారన్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే తాము నిరసనకు దిగామన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై మాట నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చుకునే దిశలో పార్టీ ఆలోచించాలన్నారు.
తమ నిరసన పార్లమెంటు చరిత్రలో నిలుస్తుందని రాజయ్య అన్నారు. ఈ బడ్జెట్ సమావేశాలలోనే తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పెద్దలు తెలంగాణపై చర్చలు జరుపుతున్నారని, అంతర్మథనంలో ఉన్నారని వివేక్ అన్నారు. తమ 48 గంటల దీక్ష చారిత్రాత్మకమన్నారు. తమ దీక్షకు పలువురు మద్దతు పలికారన్నారు.
కాంగ్రెసు తెలంగాణ ఇవ్వాలని లేదంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ దారిలోనైనా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంద జగన్నాథం అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చే స్థితిలో కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన చెప్పారు.