సభ్యత, సంస్కారం నేర్చుకో: కెసిఆర్కు గంటా హితవు
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మంత్రిగా, శాసనసభ ఉపసభాపతిగా పనిచేసిన కెసిఆర్ విధానాల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. బయ్యారం గనులను ఆంధ్రప్రాంత పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం దోచిపెడుతోందంటూ కెసిఆర్ చేసిన వాఖ్యలపై గంటా తీవ్రంగానే స్పందించారు.
ఎన్నో ఆత్మత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారని, లాభాల్లో నడుస్తున్న విశాఖ స్టీల్ప్లాంట్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సైతం పనిచేస్తున్నారన్న వాస్తవాన్ని మర్చిపోవద్దని గుర్తుచేశారు. బయ్యారంలో మరో ఉక్కు కర్మాగారం పెట్టొద్దని తాము ఏనాడూ అనలేదని, ఆప్రాంత ప్రజానీకానికి సైతం ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
సాంకేతికంగా అక్కడ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని నిపుణులు పరిశీలిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సహజ సంపదను తామే వాడుకుంటామన్న వాదనలో అర్థం లేదన్నారు. బయ్యారం ఉక్కులో వీసమెత్తు తరలించినా అడ్డుకుంటామని పదేపదే ప్రకటిస్తున్న కెసిఆర్ తెలంగాణ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా విషయం ప్రస్తావిస్తే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బయ్యారం గనుల కేటాయింపునకు విపరీతార్థాలు తీస్తూ భూకంపం సృష్టిస్తామనడం సభ్యత అనిపించుకోదన్నారు.