మేనల్లుడి గిల్లుడు: రూ.10 కోట్ల స్కాం, మంత్రిపై బాంబు
పవన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. అతను మాత్రం తన మేనల్లుడితో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. రైల్వే బోర్డులో లాభసాటి పోస్టును ఇప్పించేందుకు రైల్వే మంత్రి బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లా రూ.10 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మధ్యవర్తి నుంచి రూ.90 లక్షలు తీసుకుంటుండగా సిబిఐ రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. మహేశ్ కుమార్ 1975 బ్యాచ్ ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీసెస్ అధికారి.
ప్రస్తుతం ముంబైలో పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్గా పని చేస్తున్నారు. ఇటీవలే ఆయన రైల్వే బోర్డు (సిబ్బంది) సభ్యుడిగా పదోన్నతి పొందారు. కానీ, ఈ పోస్టులో పెద్దగా ఆదాయం రాదు. దీంతో, రైల్వే బోర్డులో ఎలక్ట్రికల్ సభ్యుడిగా పదోన్నతి పొందేందుకు పైరవీలు చేశారు. రూ.2000 కోట్లకుపైగా రైల్వే ప్రాజెక్టుల టెండర్లను కేటాయించడంలో రైల్వే బోర్డు సభ్యుడు (ఎలక్ట్రికల్) అత్యంత కీలకం. అందుకే ఆయన సందీప్ గోయల్, మంజునాథ్ అనే మధ్యవర్తుల ద్వారా విజయ్ సింగ్లాతో చర్చలు జరిపారు.
వీరిలో చండీగఢ్కు చెందిన సందీప్ గోయల్ సింగ్లా మధ్యవర్తి కాగా.. బెంగళూరుకు చెందిన మంజునాథ్ మహేశ్ కుమార్ తరఫు దళారి. సందీప్ గోయల్ రైల్వేకు ఎలక్ట్రికల్ పరికరాలు సరఫరా చేసే పిరమిడ్ ఎలక్ట్రానిక్స్ అధినేత. ఇక మంజునాథ్ రైల్వేకు సిగ్నల్ ఉత్పత్తులు, ఆటోమేషన్ పరికరాలను సరఫరా చేసే జీజీ ట్రానిక్స్ ఎండి. కాగా.. తనకు రైల్వే బోర్డులో ఎలక్ట్రికల్ సభ్యుడి పదవి ఇప్పించేందుకు మహేశ్ కుమార్ సందీప్ గోయల్తో చర్చలు జరిపాడు. ఇందుకు సందీప్ రూ.10కోట్లు డిమాండ్ చేశాడు.
సగం ముందు, సగం పనైన తర్వాత ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా తొలుత రూ.90 లక్షలు ఇచ్చేందుకు మహేశ్ అంగీకరించారు. ఈ ఒప్పందంపై సిబిఐకి ఉప్పందింది. దీంతో సింగ్లా, మహేశ్ కుమార్ ఫోన్లపై నిఘా పెట్టింది. వారి ఆనుపానులపై కన్నేసింది. చండీగఢ్, బెంగళూరు, ముంబై, ఢిల్లీల్లో సిబిఐ బృందాలను సిద్ధం చేసింది. లంచం మొత్తం సింగ్లాకు అందిన వెంటనే దాడులు చేసింది. మహేశ్ కుమార్ మధ్యవర్తి మంజునాథ్ నుంచి రూ.90 లక్షలను తీసుకుంటుండగా శుక్రవారం రాత్రి విజయ్ సింగ్లా, సందీప్ గోయల్లను చండీగఢ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
ముంబైలో దిగిన మహేశ్ కుమార్ను విమానాశ్రయంలో అరెస్టు చేసింది. ఆయనను అక్కడే సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. రెండు రోజుల ట్రాన్సిట్ రిమాండ్కు తీసుకుని ఢిల్లీకి తరలించింది. దీనికి కొనసాగింపుగా రూ.90 లక్షలను సింగ్లా ఇంటికి తీసుకొచ్చిన అజయ్ గార్గ్, రాహుల్ యాదవ్, సమీర్ సంధిర్, సుశీల్ దాగాలను శనివారం సిబిఐ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మొత్తం ఆరుగురిని ఢిల్లీకి తరలించారు.