నాయకత్వం: కాంగ్రెసులో చిరంజీవి మెగా చిచ్చు
చిరంజీవి వర్గానికి చెందిన సి. రామచంద్రయ్య వాదనకు కాంగ్రెసు పార్టీలోని ఒక వర్గం నుంచి వ్యతిరేకత ఎదరువుతోంది. సీనియర్ మంత్రులు కొంత మంది పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కత్తులు నూరుతున్న సమయంలో తనను తాను ముఖ్యమంత్రిగా ముందుకు తోసుకుని మార్గాలను చిరంజీవి చేపడుతున్నారనే మాట వినిపిస్తోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన వర్గాన్ని బలంగా తయారు చేసుకున్నారు. ఈ వర్గం చిరంజీవి వర్గం వాదనను వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని మంత్రి కొండ్రు మురళి సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిరంజీవి అంటే తమకూ అభిమానం ఉందంటూనే ఆయన ఆ మాట అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అప్రస్తుతమని, ఇప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ఆలోచన చేయాలని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి కావాలనేది మంత్రి రామచంద్రయ్య వ్యక్తిగత అభిప్రాయమని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. 2014 వరకు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డే ఉంటారని ఆయన అన్నారు. ఆ రకంగా చిరంజీవి నాయత్వంపై జెసి దివాకర్ రెడ్డి తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
సి రామచంద్రయ్య వాదనను ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ఇదివరకే వ్యతిరేకించారు. చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఓ సీనియర్, ముఖ్యమైన నేత మాత్రమేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న సి.రామచంద్రయ్య వ్యాఖ్యల్లో తప్పులేదని గండ్ర అన్నారు. అది చిరంజీవి పైన రామచంద్రయ్యకు ఉన్న అభిమానమని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.
ఇంతకీ రామచంద్రయ్య ఏమన్నారు...
కాంగ్రెసు పార్టీకి 2014లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవే ముఖ్యమంత్రి అభ్యర్థి అని మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. చిరంజీవిని కాంగ్రెసు పార్టీ సరిగా వాడుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి చిరంజీవి ఒక్కడే ప్రధానంగా కనిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. చిరంజీవిని మించిన నేత లేడన్నారు. కాంగ్రెసు పార్టీకి చిరు అవసరముందన్నారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కూడా ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రివర్గ నిర్ణయాలు ఆయన సొంత వ్యవహారాలు కాదన్నారు. కేబినెట్లో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు చిరంజీవి వైపు చూస్తున్నారని అంతకు ముందు విశాఖపట్నంలో సి. రామచంద్రయ్య అన్నారు.