ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ: బాబుపై లగడపాటి విసుర్లు
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను వివాదం చేయడం బాధాకరమని ఆయన అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఇవ్వడానికి కేంద్ర మంత్రి పురంధేశ్వరి అడ్డుపడ్డారని చంద్రబాబు అన్నారని, అల్లూరి సీతారామారాజు విగ్రహం ఇవ్వడానికి అడ్డుపడిందెవరని ఆయన అన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఒక పార్టీవారు రావాలి, మరో పార్టీవారు రాకూడదని లేదని ఆయన అన్నారు. తెలుగు జాతి ఐక్యతకు ఎన్టీఆర్ పాటుపడ్డారని, ఎన్టీఆర్ అందరివాడని ఆయన అన్నారు. తల్లా, పెళ్లామా అనే సినిమాలోని తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది అనే పాటను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.
తెలుగువారికి ఎన్టీ రామారావు గుర్తింపు తెచ్చారని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై రొడ్డెక్కి రోడ్డు పాలు కావడం సరి కాదని ఆయన అన్నారు. విగ్రహావిష్కరణపై రాద్ధాంతం తగదని ఆయన చెప్పారు. ఎన్టీ రామారావు విగ్రహాన్ని రేపు మంగళవారం స్పీకర్ మీరా కుమార్ పార్లమెంటు ఆవరణలో ఆవిష్కరించనున్నారు. కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి విగ్రహాన్ని ప్రదానం చేశారు.
కాగా, తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ను వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివప్రసాద్ విమర్శించారు. ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ వేర్వేరు కాదని ఆయన సోమవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. స్పీకర్ ఆహ్వానం మేరకు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్తారని ఆయన చెప్పారు. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి మంత్రి శైలజానాథ్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.